హైదరాబాద్, జనవరి 24(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ భవన ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. వేద పండితుల సూచన మేరకు ఫిబ్రవరి 17న (శుక్రవారం) ఉదయం 11.30 గంటల నుంచి 12.30 గంటల మధ్య ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చేతులమీదుగా సచివాలయ భవనాన్ని ప్రారంభించనున్నట్టు రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు, జార్ఖండ్ ముఖ్యమంత్రులు స్టాలిన్, హేమంత్సోరెన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీయాదవ్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ తరఫున ఆయన ప్రతినిధిగా జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్సింగ్, అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ తదితర ప్రముఖులు పాల్గొంటారు.
భవన ప్రారంభోత్సవానికి ముందు ఉదయం వేద పండితుల ఆధ్వర్యంలో వాస్తుపూజ, చండీయాగం, సుదర్శనయాగం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సచివాలయ ప్రారంభం తరువాత మధ్యాహ్నం సికింద్రాబాద్లోని పరేడ్గ్రౌండ్స్లో భారీ బహిరంగసభ నిర్వహించనున్నారు. ఈ సభలో సచివాలయ ప్రారంభోత్సవానికి హాజరయ్యే ముఖ్య అతిథులంతా పాల్గొంటారని వేముల ప్రశాంత్రెడ్డి వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినమైన ఫిబ్రవరి 17న సచివాలయాన్ని ప్రారంభించాలని ఇదివరకే నిర్ణయించగా, తాజాగా వేద పండితుల సూచనల మేరకు ముహూర్తం ఖరారుచేశారు. సచివాలయ భవనానికి జూన్ 2019న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయగా.. అత్యాధునిక పద్ధతులు, సకల సౌకర్యాలతో మూడున్నరేండ్లలోనే అందుబాటులోకి రావడం విశేషం.