హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ) : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 46లక్షల మంది మహిళలకు వైద్య పరీక్షలు చేయనున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. బుధవారం ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికపై సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజులపాటు నిర్వహించే కార్యక్రమాలపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూపు మహిళల హెల్త్ ప్రొఫైల్ తయారీ ప్రొగ్రామ్ను ప్రారంభించనున్నట్టు వివరించారు. తెలంగాణ డయాగ్నొస్టిక్స్ సహకారంతో ఒక్కో మహిళకు మొత్తం 30 రకాల పరీక్షలు చేయనున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మొత్తం 4 దశల్లో కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
తొలి దశలో ఈనెల 6 నుంచి 31 వరకు మాతా శిశు సంరక్షణ, కౌమర దశ బాలికలు, వృద్ధులకు, రెండో దశలో ఏప్రిల్ 1 నుంచి 15 వరకు అసంక్రమిత వ్యాధులైన బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి వాటిని గుర్తించేందుకు సబ్ సెంటర్ల పరిధిలో విస్తృతమైన స్క్రీనింగ్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. మూడో దశలో ఏప్రిల్ 16 నుంచి మే 15 వరకు అంటువ్యాధుల నియంత్రణ, ప్రజారోగ్య సన్నద్ధతపై యంత్రాంగం దృష్టి సారించినట్టు స్పష్టంచేశారు. మే 16 నుంచి జూన్ 12 వరకు నాలుగో దశలో జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మేడ్చల్ పరిధిలోని 145 అర్బన్ పీహెచ్సీలను పాలిక్లినిక్స్గా అప్గ్రేడ్ చేసి, స్పెషాలిటీ వైద్య సేవలను అందించాలని మంత్రి సూచించారు.