హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న నర్సులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ప్రభుత్వ దవాఖానల్లో విధులు నిర్వహిస్తున్న నర్సింగ్ సిబ్బంది హోదాను ఉన్నతీకరించింది. వారి గౌరవం మరింత పెంచేలా ప్రస్తుత వృత్తి పేరును ఉన్నతీకరించాలని నర్సులు ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని.. వివిధ హోదాల్లో పేర్లు మార్చుతూ ‘ఆఫీసర్లు’గా ఖరారు చేసింది. తాజా నిర్ణయం ప్రకారం ఇకపై స్టాఫ్ నర్స్ను నర్సింగ్ ఆఫీసర్గా, హెడ్ నర్స్ను సీనియర్ నర్సింగ్ ఆఫీసర్గా, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్-2ను డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్గా, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్-1ను చీఫ్ నర్సింగ్ ఆఫీసర్గా మార్పులు చేసింది. వైద్యారోగ్యశాఖతోపాటు, ఇతర శాఖల్లో విధులు నిర్వర్తించే నర్సింగ్ సిబ్బందికి ఈ మార్పులు వర్తిస్తాయని ఆదేశాల్లో పేరొన్నది. పబ్లిక్ హెల్త్ విభాగంలోని దవాఖానల్లో పనిచేసే పబ్లిక్ హెల్త్ నర్స్ పోస్టును పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్గా, డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ పోస్టును యథాతథంగా ఉంచింది.
హోదా మార్పు పట్ల నర్సులు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఎంతోకాలంగా హోదా మార్పు కోసం ఎదరుచూస్తున్న రాష్ట్ర నర్సింగ్ సమాజానికి ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు తీపికబరు అందించారని, తమ గౌరవాన్ని మరింత పెంచారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామని చెప్పారు. గురువారం కోఠిలోని నర్సింగ్ కౌన్సిల్ వద్ద సంబురాలు జరుపుకున్నారు. ఉస్మానియా దవాఖానలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 1874లో మద్రాస్ రాష్ట్రంలో ‘నర్సు’ల పేరుతో నియామకం మొదలైందని, 1919లో ‘సిస్టర్స్/స్టాఫ్నర్స్’గా పిలవడం ప్రారంభమైందని అన్నారు. 1956లో స్టాఫ్ నర్స్ అని హాస్పిటల్ స్టాండింగ్ ఆర్డర్లో పేరొన్నారని చెప్పారు. అప్పటినుంచి సుమారు 70 ఏండ్ల తర్వాత తమ హోదా మార్పు జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయంతో సమాజంలో నర్సుల గౌరవం మరింత పెరుగుతుందని అన్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ దవాఖానల్లో పనిచేస్తున్న ప్రతి నర్సింగ్ ఆఫీసర్ బాధ్యత కూడా పెరుగుతుందని చెప్పారు. ఉత్సాహంతో మరింత మెరుగైన సేవలను అందిస్తామన్నారు. కార్యక్రమంలో నర్సింగ్ డీడీ విద్యుల్లత, ఏడీ విజయనిర్మల, నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్ విద్యావతి, ఉస్మానియా హాస్పిటల్ గ్రేడ్-1 సుజాత రాథోడ్, నర్సింగ్ ఆఫీసర్లు లక్ష్మణ్ రుడావత్, విద్యాసాగర్, రవి నాయక్, కృష్ణ, నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కార్యదర్శి నగేశ్, నిమ్స్ నర్సింగ్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ నర్సింగ్ సిబ్బందికి శుభాకాంక్షలు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు, మీ గౌరవాన్ని మరింత పెంచేలా పోస్టుల పేర్లు ఉన్నతీకరిస్తూ తెలంగాణ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకున్నది. ప్రేమ, ఆప్యాయతతో కూడిన వైద్య సేవలు ప్రజలకు అందించి ప్రభుత్వ దవాఖానలపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంపొందించాలని ఆకాంక్షిస్తున్నాను.
– మంత్రి హరీశ్ రావు