విద్యానగర్, జూలై 3: ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ తీర్మానించాలని, లేదంటే కేంద్రంపై తిరుగుబాటు తప్పదని గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుగులోతు తిరుపతి నాయక్ హెచ్చరించారు. కరీంనగర్లోని ఎంపీ బండి సంజయ్ కార్యాలయాన్ని ఆదివారం గిరిజన సంఘాల నేతలు ముట్టడించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కార్యాలయ ముట్టడికి ప్రయత్నించిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తిరుపతి నాయక్ మాట్లాడుతూ.. కేంద్రం ద్వంద్వ వైఖరి వల్ల తెలంగాణలోని గిరిజన బిడ్డలకు అన్ని రంగాల్లో తీరని నష్టం జరిగిందని ఆరోపించారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలు, ఎస్టీలకు 7 శాతం ఉన్న రిజర్వేషన్లను 10 శాతానికి తక్షణమే పెంచాలని డిమాండ్చేశారు. జనాభా ప్రాతిపదికన గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి సిఫారసు చేస్తే ఆమోదించట్లేదని మండిపడ్డారు.