హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో శని, ఆదివారాల్లో నిర్వహించే ఎస్సై, ఏఎస్సై ఉద్యోగాల తుది రాత పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) తెలిపింది. అభ్యర్థులంతా పరీక్ష ప్రారంభానికి ముందే పరీక్షాకేంద్రాలకు చేరుకోవాలని సూచించింది.
పరీక్షాకేంద్రాల వద్ద ఎవరైనా, ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించింది. పరీక్షలు సజావుగా జరిగేందుకు నోడల్ అధికారులను, ప్రత్యేక సిబ్బందిని నియమించినట్టు తెలిపింది. మొత్తం 62,342 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారని వెల్లడించింది. కరీంనగర్, హైదరాబాద్, వరంగల్ జిల్లాలోని 81 పరీక్షాకేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని వివరించింది.