హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వం భారీ సంస్కరణలు తీసుకువచ్చింది. ఈ విద్యాసంవత్సరం నుంచి 11 పేపర్లను కుదించి, 6 పేపర్లకే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఒక్కో సబ్జెక్టులో 80 మార్కులకు పరీక్ష ఉంటుంది. మిగతా 20 మార్కుల్ని ఫార్మెటివ్ అసెసెమెంట్కు ఇచ్చారు. 9వ తరగతి విద్యార్థులకు కూడా ఇదే విధానం వర్తిస్తుంది. ఈ మేరకు బుధవారం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో 33 జారీ చేశారు. ఇదివరకు వ్యాసరూప, సూక్ష్మరూప ప్రశ్నలు రెండింటిలోనూ విద్యార్థులకు చాయిస్ ఇచ్చేవారు. కానీఇప్పుడు వ్యాసరూప ప్రశ్నల్లోనే చాయిస్ ఉంటుంది. సూక్ష్మ రూప ప్రశ్నలకు చాయిస్ వర్తించదు. మరోవైపు పదో తరగతి పరీక్షల షెడ్యూల్ కూడా విద్యాశాఖ ఖరారు చేసింది. పరీక్షలు వచ్చే ఏడాది ఏప్రిల్ 3న ప్రారంభమై, 13న ముగుస్తాయని తెలిపింది. పదోతరగతి పరీక్షల షెడ్యూల్ రూపకల్పనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం సమీక్షను నిర్వహించారు. ఈ ఏడాది నుంచి 100 శాతం సిలబస్తో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. గతంలో కరోనా ప్రభావంతో గత రెండేండ్లు 70శాతం సిలబస్కే పరీక్షలు నిర్వహించామని గుర్తుచేశారు. పరీక్షల దృష్ట్యా సెలవు రోజుల్లో కూడా విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు ఏదైనా సబ్జెక్టుల్లో వెనుకబడి ఉంటే వారికి ప్రత్యేకంగా బోధించాలని తెలిపారు. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా సర్కారు బడులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఫిబ్రవరి , మార్చి మాసాల్లో ఫ్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నట్టు వివరించారు. సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
పదో తరగతి పేపర్లను 6 పేపర్లకు కుదించిన నేపథ్యంలో మాడల్ పేపర్లను ఎస్సీఈఆర్టీ వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్టు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి తెలిపారు. అన్ని సబ్జెక్టులకు సంబంధించిన మాడల్ పేపర్లను అందుబాటులో ఉంచామని చెప్పారు.
సైన్స్ సబ్జెక్టులో భౌతికశాస్త్రం, జీవశాస్త్రం పేపర్లకు 40 మార్కుల చొప్పున ఒకేరోజు పరీక్ష నిర్వహిస్తారు. సైన్స్ పేపర్కు పరీక్షా సమయం 3 : 20 నిమిషాలు కాగా, మిగతా సబ్జెక్టులకు 3 గంటల సమయం కేటాయించారు.
పదో తరగతి వార్షిక పరీక్షలను 11 పేపర్లకు బదులుగా ఆరు పేపర్లకే నిర్వహించాలని నిర్ణయించడాన్ని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు, ప్రధాన కార్యదర్శి సాదుల మధుసూదన్, కోశాధికారి ఐవీ రమణారావు స్వాగతించారు. మాడల్ పేపర్లను సైతం విడుదల చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.