హైదరాబాద్ సిటీబ్యూరో/వరంగల్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం ఫొటోలను ఉద్దేశపూర్వకంగా పరీక్ష హాల్ నుంచి బయటకు తీసుకొచ్చిన కేసులో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్తోపాటు ఆయన పీఏలు పెండ్యాల రాజు, ఎదులాపురం నరేందర్కు పోలీసులు నోటీసులు జారీచేశారు. గురువారం సాయంత్రం 6 గంటలకు లేదా శుక్రవారం ఉదయం 11 గంటలకు వరంగల్ సెంట్రల్ డీసీపీ ఆఫీసుకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలని, మొబైల్ ఫోన్లు కూడా తీసుకొనిరావాలని నోటీసులో పేర్కొన్నారు. గురువారం వరంగల్ కమిషనరేట్ పరిధిలోని కమలాపూర్ పోలీస్స్టేషన్ పోలీసులు మేడ్చల్ మండలం పూడురు గ్రామ పరిధిలో ఉన్న ఈటల నివాసానికి వెళ్లి స్వయంగా నోటీసులు అందజేశారు. సీఆర్పీసీలోని 91 ఆధారంగా ఈ నోటీసులు జారీచేసినట్టు పేర్కొన్నారు. పక్కా ప్లాన్తో కుట్రపూరితంగా మాల్ప్రాక్టీస్కు పాల్పడి, పుకార్లు పుట్టించేందుకు కుట్ర పన్నారని, ప్రశ్నపత్రం ఫోటో తీసి దానిని వివిధ గ్రూప్ల్లో సర్క్యులేట్ చేశారని నోటీసుల్లో వివరించారు. గురువారం సాయంత్రం వీరు రానందున శుక్రవారం హాజరయ్యే అవకాశం ఉన్నది. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తులో కీలకమైన పదో తరగతి పరీక్ష పేపర్ను బయటకు తీసుకువచ్చిన కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీలో కీలకంగా వ్యవహరించే బూరం ప్రశాంత్, గుండెబోయిన మహేశ్, మౌటం శివగణేశ్ను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేయగా, కోర్టు రిమాండ్కు పంపించింది. పదో తరగతి ప్రశ్నపత్రం ఔట్ అయిన వ్యవహారంలో వరంగల్ కమిషరేట్ పోలీసులు విస్తృత స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకునే విధంగా వ్యవహరించే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులైన అందరిపై చర్యలు తీసుకునేలా వివరాలు సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఈటల రాజేందర్, ఆయన పీఏలు రాజు, నరేందర్కు నోటీసులు జారీచేశారు. పరీక్ష జరుగుతున్న సమయంలో బూరం ప్రశాంత్ ఫోన్ నుంచి ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు, మరో నిందితుడు గుండెబోయిన మహేశ్ ఫోన్ నుంచి ఈటల రాజేందర్ పీఏలు రాజు, నరేందర్కు హిందీ పేపరు వాట్సాప్లో చేరింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన రాజు, మంచిర్యాల జిల్లా రామకృష్ణాపురానికి చెందిన నరేందర్ ఫోన్ల నుంచి మరికొంత మందికి ఫార్వర్డ్ అయినట్టుగా ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు.
టెన్త్ హిందీ పేపరును సోషల్ మీడియాలో విస్తృతంగా ఫార్వర్డ్ చేసిన అందరినీ విచారించేలా వరంగల్ పోలీసులు చర్యలు చేపట్టారు. సోషల్ మీడియాలో పేపరును ఫార్వర్డ్ చేసిన మరో 100 మందికి నోటీసులు జారీ చేశారు. ఈటల రాజేందర్ సొంత గ్రామం కమలాపూర్ ప్రభుత్వ బాలుర పాఠశాల నుంచి హిందీ పేపర్ ఫొటో బయటికి వచ్చింది. ఇదే గ్రామానికి చెందిన మైనర్ బాలుడితో కలిసి మౌటం శివగణేశ్ హిందీ పేపర్ ఫొటోను బయటకు తీసుకొని రాగా.. బూరం ప్రశాంత్ వందల వాట్సాప్ గ్రూపుల్లో, వేల మందికి స్వయంగా ఫార్వర్డ్ చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. టెన్త్ హిందీ పేపరు ఫొటోలు ఎక్కువ మందికి ఫార్వర్డ్ కావడానికి కారణమైన ఎస్సెస్సీ 2019-20 వాట్సాప్ గ్రూపుపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ వాట్సాప్ గ్రూపు అడ్మిన్ కార్తీక్తోపాటు ఈ గ్రూపు నుంచి ఇతర గ్రూపులకు ఫార్వర్డ్ చేసిన ప్రతి ఒక్కరినీ పోలీసులు విచారణకు పిలిచారు. ఈ వ్యవహారంపై పోలీసు కేసు నమోదు కాగానే చాలామంది తమ ఫోన్లలో డాటాను డిలీట్ చేశారు. పోలీసులు సాంకేతికతను వినియోగించి ఫార్వర్డ్ చేసిన అందరి వివరాలను సేకరిస్తున్నారు. పోలీసుల నుంచి తనకు నోటీసులు అందాయని, విచారణకు హాజరవుతానని ఈటల రాజేందర్ తెలిపారు.
సెక్షన్ 91 ఏమి చెప్తున్నదంటే: సమన్లు అందుకున్న వ్యక్తి పోలీసులు వివరాలు కావాలని అడిగితే తెలిసిన నిజాన్ని డాక్యుమెంట్ల రూపంలో, ఇతర పద్ధతుల్లోనూ అందించాల్సి ఉంటుంది. సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్ అంశాల మీద, ప్రొడక్షన్ ఆఫ్ బేసిక్ హ్యూమన్ రైట్స్ మీద, వెల్ఫేర్ ఆఫ్ చిల్డ్రన్ అంశం మీద, ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మీద, వాయిలేషన్ ఆఫ్ రిలీజెస్ రైట్స్ మీద.. ప్రజల అంశాలు, ప్రజా సంక్షేమ విషయాలపై సంబంధిత వ్యక్తిని వివరణ కోరవచ్చు.