రాష్ట్రంలోని పరివాహక ప్రాంతాలతోపాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో పలు ప్రాజెక్టులకు స్వల్పంగా వరద కొనసాగుతున్నది. గోదావరి బేసిన్లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు స్వల్పంగా వర ద పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 15 వేల క్యుసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతున్న ది. దీంతో శనివారం ఉదయం ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తి వరదను దిగువకు వదిలారు. ఈ సీజన్లో ప్రాజెక్టు గేట్లను ఎత్తి గోదావరిలోకి నీటిని వదలడం ఇది ఐదోసారి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు( 90.313 టీఎంసీలు) కాగా పూర్తిస్థాయి నీటిమట్టంతో ఉన్నది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 22 వేల క్యూసెక్కుల వరద చేరుతున్నది. కృష్ణాలోనూ స్వల్పంగా వరద ప్రవాహం పెరుగుతున్నది. జూరాలకు 9వేలు, శ్రీశైలం ప్రాజెక్టుకు 16వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. ఇప్పటికీ ఆయా ప్రాజెక్టులు జలకళను సంతరించుకోవడంతో గేట్లతో ఎత్తి వరదను దిగువకు వదిలిపెడుతున్నారు. హైదరాబాద్, వరంగల్లో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మూసీకి వరద పోటెత్తుతున్నది. శనివారం మధ్యాహ్నం 3,750 క్యూసెక్కుల ఇన్ఫ్లోనమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువ కావడంతో అధికారులు 3 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు.