హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని పాలకమండలి పదవీకాలం బుధవారం ముగిసింది. తదుపరి పాలక మండలిని నియమించేవరకు దేవస్థాన నిర్వహణ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. టీటీడీ ఈవో ఆధ్వర్యంలో స్పెసిఫైడ్ అథారిటీకి అప్పగించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని పాలకమండలి ఆధ్వర్యంలో గత రెండేండ్లలో భక్తులకు ఉపయోగపడే అనేక అభివృద్ధి, హిందూధర్మ ప్రచార కార్యక్రమాలను చేపట్టింది. ఆ సేతు హిమాచలం హిందూ ధర్మప్రచారమే లక్ష్యంగా పనిచేసింది. ఈ క్రమంలో భక్తులకు సౌకర్యాలు మెరుగుపరచటంతోపాటు, సామాజిక సేవా కార్యక్రమాలు విరివిగా నిర్వర్తించింది.