నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 9: కృష్ణమ్మ మళ్లీ పరవళ్లు తొక్కుతున్నది. కృష్ణాబేసిన్లో ప్రాజెక్టులన్నింటికీ వరద పోటెత్తుతున్నది. శుక్రవా రం శ్రీశైలం రిజర్వాయర్కు 4 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదుకాగా పది గేట్లు ఎత్తి 4.42 లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. నాగార్జునసాగర్కు శ్రీశైలం నుంచి 4,41,824 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నది. దాంతో ప్రాజెక్టు 22 క్రస్ట్గేట్ల ద్వారా 3,48,956 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 (312 టీఎంసీలు) అడుగులకు గాను 588.20 (306.6922 టీఎంసీలు) అడుగుల మేర నీరు నిల్వ ఉన్నది. జూరాలకు ఇన్ఫ్లో 2.09 లక్షల క్యూసెక్కులు రాగా 30 గేట్లు ఎత్తి 2,01, 891 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.
ఎస్సారెస్పీకి కొనసాగుతున్న ఇన్ఫ్లో
గోదావరి బేసిన్లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 30,100 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. 4 గేట్లు ఎత్తి 12,400 క్యూసెక్కుల నీటిని బయటికి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు)కాగా శుక్రవారం సాయంత్రానికి అంతేస్థాయిలో నిండి ఉన్నదన్నారు.