Telangana | హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం, నాగార్జునసాగర్ ఉమ్మడి ప్రాజెక్టులకు సంబంధించిన 15 ఔట్లెట్లను ఈ నెలాఖరులోగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు అప్పగించేందుకు రెండు తెలుగు రాష్ర్టాలు సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తున్నది. సంబంధిత ప్రతిపాదనలపై తెలంగాణ పలు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ వాటిని కేంద్ర జల్శక్తి శాఖ తోసిపుచ్చింది. తొలుత ఆ ప్రాజెక్టులను అప్పగించాల్సిందేనని, ఆ తర్వాత రెండు రాష్ర్టాలు ఎలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేసినా పరిశీలిస్తామని తేల్చిచెప్పింది.
ఈ విషయమై త్వరలోనే మరోసారి సమావేశం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఏపీ పునర్వవ్యవస్థీకరణ చట్టం ప్రకారం శ్రీశైలం డ్యామ్ ఏపీ పరిధిలో, సాగర్ డ్యామ్ తెలంగాణ పరిధిలో ఉండాలి. అయితే నిరుడు నవంబర్ 29న ఏపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా సాగర్ డ్యామ్ను అక్రమించిన నేపథ్యంలో రెండు రాష్ర్టాల అధికారులతో కేంద్ర జల్శక్తిశాఖ కార్యదర్శి దేబ్శ్రీ ముఖర్జీ బుధవారం న్యూఢిల్లీలోని శ్రమశక్తిభవన్లో ప్రత్యేక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. శ్రీశైలం, సాగర్ డ్యామ్లతోపాటు, వాటికి సంబంధించిన 15 ఔట్లెట్లు, ఆస్తులు, ఉద్యోగులతో సహా బోర్డుకు అప్పగించాలని ఇరు రాష్ర్టాలను ఆదేశించారు. దీనిపై ఇరురాష్ర్టాలు తమ వాదనలను వినిపించాయి.
ప్రభుత్వానికి నివేదించాకే..
కేంద్ర జల్శక్తిశాఖ ప్రతిపాదనలను తెలంగాణ రాష్ట్ర సాగునీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తీవ్రంగా వ్యతిరేకించారు. ఏపీ స్వాధీనంలో ఉన్న సాగర్ కుడికాలువను తొలుత తెలంగాణకు అప్పగించి, పూర్వస్థితిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల అప్పగింత అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాకే తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని కేంద్రానికి స్పష్టం చేశారు.
ట్రిబ్యునల్ అవార్డు వచ్చే వరకూ కృష్ణా జలాలను 50ః50 నిష్పత్తిలో వినియోగించుకుంటామని, క్యారీ ఓవర్కు అవకాశమివ్వాలని, శ్రీశైలం ఎండీడీఎల్ను 834 ఫీట్లుగా నిర్ణయించాలని, పోతిరెడ్డిపాడు ద్వారా 34 టీఎంసీలను మాత్రమే వినియోగించుకునేలా ఏపీని కట్టడి చేయాలని తెలంగాణ ఎంతో కాలం నుంచి కోరుతున్నదని గుర్తుచేశారు. ఈ అంశాలన్నింటినీపై కేంద్రం నుంచి స్పష్టత వచ్చాకే ప్రాజెక్టుల అప్పగింత అంశంపై ఆలోచిస్తామని తేల్చిచెప్పారు.
ప్రాజెక్టుల ఆపరేషన్ ప్రొటోకాల్, రూల్కర్వ్లు కొలిక్కి వచ్చిన తర్వాతే ప్రాజెక్టుల అప్పగింత సాధ్యమని స్పష్టం చేశారు. కాగా, కేంద్ర జల్శక్తిశాఖ ప్రతిపాదనలకు ఏపీ సర్కారు అంగీకరించింది. రివర్ బోర్డుల గెజిట్ ప్రకారం ప్రాజెక్టులను అప్పగించేందుకు తమ ప్రభుత్వం ఇప్పటికే జీవోను జారీ చేసిందని, ప్రాజెక్టులను అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీ అధికారులు తెలిపారు.
ప్రాజెక్టుల స్వాధీనానికి కేంద్రం నిర్ణయం
రెండు రాష్ర్టాల అభిప్రాయాలను విన్న అనంతరం ప్రాజెక్టులను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని కేంద్ర జల్శక్తిశాఖ నిర్ణయించింది. సాగర్ డ్యామ్ను తిరిగి తెలంగాణకు అప్పగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను తోసిపుచ్చింది. రెండు ప్రాజెక్టులను బోర్డుకే అప్పగించాలని నిర్ణయించాక మళ్లీ తెలంగాణకు అప్పగించడమేంటని ప్రశ్నించింది. ప్రాజెక్టుల అప్పగింతపై ఏమైనా అభ్యంతరాలు, అభిప్రాయాలు ఉంటే నివేదించాలని, వాటిపై చర్చించి పరిష్కరిస్తామని కేంద్రం తెలిపింది. ఏదేమైనా ప్రాజెక్టులను మాత్రం అప్పగించాల్సిందేనని తేల్చిచెప్పినట్టు సమాచారం.
విద్యుత్తు ప్రాజెక్టులు, ఔట్లెట్లు, సాంకేతిక పరిమితుల్లో ఏవి ఎవరి పరిధిలో ఉండాలన్న దానిపై ఇరు రాష్ట్రాల సీఈలు చర్చించుకుని నిర్ణయానికి రావాలని, ప్రస్తుతం సీఆర్పీఎఫ్ కొనసాగిస్తున్న పెట్రోలింగ్ను యథాతథంగా ఉంచాలని దేబ్శ్రీ ముఖర్జీ తెలిపారు. సాంకేతిక అంశాలపై ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయతో నివేదిక పంపిన తర్వాత మరోసారి భేటీ ఉంటుందని దేబ్శ్రీ ముఖర్జీ స్పష్టం చేసినట్టు అధికారులు వెల్లడించారు. సమావేశంలో తెలంగాణ తరఫున రాహుల్ బొజ్జాతోపాటు, ఈఎన్సీ మురళీధర్, అంతరాష్ట్ర జలమండలి అధికారులు కోటేశ్వర్రావు, శ్రీధర్రావు దేశ్పాండే, సల్లా విజయ్కుమార్ పాల్గొన్నారు.
తెలంగాణ జల హక్కులకు తీవ్ర విఘాతం
శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులను కేంద్రానికి స్వాధీనం చేస్తే తెలంగాణ జల హక్కులకు తీవ్ర విఘాతం కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల అప్పగింతను తీవ్రంగా వ్యతిరేకించింది. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల నిర్వహణకు సీడబ్ల్యూసీ రూపొందించిన రూల్కర్వ్, ఆపరేషన్ ప్రొటోకాల్పై రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ) చేసిన సిఫారసులను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని గతంలో అనేకసార్లు తేల్చిచెప్పింది.
ఈ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి చేసిన జల విద్యుత్తును ఇరు రాష్ర్టాలు 50ః50 నిష్పత్తిలో పంచుకోవాలన్న ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రాజెక్టుల రూల్కర్వ్స్ ట్రిబ్యునల్ అవార్డులకు అనుగుణంగా ఉండాలని, అందుకు విరుద్ధంగా రూపొందించే రూల్కర్వ్స్ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పలుమార్లు స్పష్టం చేసింది. శ్రీశైలం నుంచి 34 టీఎంసీలను మాత్రమే వినియోగించుకునేందుకు ఏపీకి అనుమతివ్వాలని ఆది నుంచీ డిమాండ్ చేస్తున్నది. ప్రాజెక్టులన్నీ నిండిన తరువాత వృథాగా దిగువకు పోకుండా మళ్లించుకునే మిగులు జలాలను లెక్కించవద్దన్న ఆర్ఎంసీ ప్రతిపాదనను నిర్దంద్వంగా తోసిపుచ్చింది.
కృష్ణా నది నుంచి మళ్లించే ప్రతి నీటి చుక్కనూ లెక్కించాల్సిందేనని కరాఖండిగా తేల్చి చెప్పింది. నీటిని మళ్లింపు, నిల్వ సామర్థ్యం ఏపీకి చాలా ఎక్కువగా ఉన్నందున స్పిల్ ఓవర్ సమయంలో మళ్లించిన నీటిని కూడా ఏపీ వాటా కింద లెకించాలని, లేకుంటే మళ్లీ ఉమ్మడి స్టోరేజీల నుంచి నీటిని కోరుతూ ఏపీ అధిక మొత్తంలో జలాలను వినియోగించుకునే అవకాశమున్నదని అభ్యంతరాలను వ్యక్తం చేసింది.
కృష్ణా జలాలను 50ః50 నిష్పత్తిలోనే వినియోగించుకుంటామని పదేపదే పునరుద్ఘాటించడంతోపాటు ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం క్యారీ ఓవర్ స్టోరేజీకి అవకాశం కల్పించాలని పట్టుబడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్ఎంసీ నివేదికపై సంతకం కూడా చేయలేదు. కానీ, ఆయా అంశాలపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాకపోయినప్పటికీ ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించడం గమనార్హం. దీంతో తెలంగాణ జల హక్కులకు తీవ్ర విఘాతం కలగడం ఖాయంగా కనిపిస్తున్నది.