శ్రీశైలం : శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను మంగళవారం తెలంగాణకు చెందిన ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి దంపతులు, ఆర్ధిక , వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్రావుతోపాటు నాగర్కర్నూల్ నియోజకవర్గ శాసనసభ్యులు మర్రి జనార్ధన్రెడ్డి, శాసనమండలి సభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు శ్రీకృష్ట దేవరాయ గోపురం వద్ద ఈవో లవన్న , అర్చక వేదపండితులు తిలక ధారణ చేసి ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. స్వామివారి ఆలయంలో అభిషేకము బిల్వార్చన, అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన, హారతులు నిర్వహించారు. ఆలయ ప్రాకారంలోని పరివార దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహంచారు. అనంతరం ప్రధానార్చకులు వేదాశీర్వచనాలు, అభిషేక జల తీర్థప్రసాదాలు, పరిమళ విభూది, శేషవస్ర్తాలను అందించారు.
ఆలయంలో పరివార దేవుళ్లకు వార పూజలు
లోక క్షేమాన్ని కాంక్షిస్తూ శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల దేవస్థానంలో పరివార దేవుళ్లకు వార పూజలను శాస్ర్తోక్తంగా నిర్వహిస్తున్నట్లు ఈవో లవన్న తెలిపారు. ఆలయ ప్రాంగణంలో కొలువైవున్న కుమారస్వామికి మంగళవారం ఉదయం షోడషోపచార పూజాధి క్రతువులు నిర్వహించారు. క్షేత్రపాలకుడైన బయలు వీరభద్రస్వామికి ప్రదోషకాల పూజలు శాస్ర్తోక్తంగా జరిపించారు.
నందిమండపం వద్ద కొలువైన శనగలబసవన్నకు ప్రత్యేక క్రతువులు నిర్వహించారు. అనంతరం నందీశ్వరునిపై స్వామిఅమ్మవార్ల ఉత్సవ మూర్తులను అధిష్టించి, అష్టోత్తరశతనామ పూజాదికాలు నిర్వహించి శనగలు నైవేద్యంగా సమర్పించారు.