స్వరాష్ట్రంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు చరిత్రను తిరగరాస్తున్నది. ఆరు దశాబ్దాలుగా ఒక్క పంటకు, అదీ దిగువమానేరు ఆయకట్టు వరకు మాత్రమే నీటిని అందించిన ప్రాజెక్టు.. నేడు రెండు తరి పంటలకు ఆఖరి మడి వరకూ తడిని అందిస్తున్నది. ఏనాడూ 4 వేల క్యూసెక్కులకు మించని కాకతీయ కాలువ నేడు 347 కిలోమీటర్ల పొడవునా 8 వేల క్యూసెక్కులతో నిండుగా పారుతున్నది. ఎస్సారెస్పీ ప్రాజెక్టు ప్రతిపాదిత లక్ష్యాన్ని సుసంపన్నం చేస్తున్నది. అందుకు కారణం ఒక్కటే. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న బహుముఖ ప్రణాళికలు. ఒకవైపు కాలువ ఆధునీకరణ చేపట్టడం, మరోవైపు టెయిల్ ఎండ్ పద్ధతులను అనుసరించడం మూలంగానే గోదారి పరవళ్లు తొక్కుతున్నది. ఉత్తర తెలంగాణ వరదాయిని పేరును సార్థకం చేసుకొంటున్నది. శ్రీరాంసాగర్పై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
హైదరాబాద్, డిసెంబర్16 (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్రంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు చరిత్రను తిరగరాస్తున్నది. ఆరు దశాబ్దాలుగా ఒక్క పంటకు, అదీ దిగువమానేరు ఆయకట్టు వరకు మాత్రమే నీటిని అందించిన ప్రాజెక్టు.. నేడు రెండు తరి పంటలకు ఆఖరి మడి వరకూ తడిని అందిస్తున్నది. ఏనాడూ 4 వేల క్యూసెక్కులకు మించని కాకతీయ కాలువ నేడు 347 కిలోమీటర్ల పొడవునా 8 వేల క్యూసెక్కులతో నిండుగా పారుతున్నది. ఎస్సారెస్పీ ప్రాజెక్టు ప్రతిపాదిత లక్ష్యాన్ని సుసంపన్నం చేస్తున్నది. అందుకు కారణం ఒక్కటే. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న బహుముఖ ప్రణాళికలు. ఒకవైపు కాలువ ఆధునీకరణ చేపట్టడం, మరోవైపు టెయిల్ ఎండ్ పద్ధతులను అనుసరించడం మూలంగానే గోదారి పరవళ్లు తొక్కుతున్నది. ఉత్తర తెలంగాణ వరదాయిని పేరును సార్థకం చేసుకొంటున్నది. శ్రీరామ్సాగర్పై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గోదావరిపై నిర్మించిన ఒకే ఒక్క భారీ ప్రాజెక్టు శ్రీరాంసాగర్. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అంటూ నాటి పాలకులు ఊదరగొట్టినా ఆచరణలో మాత్రం దుఃఖదాయిగా మిగిలిపోయింది. సీఎం కేసీఆర్ అన్నట్టుగా ఈ ప్రాజెక్టు గురించి చెప్తే రామాయణమంత. హైదరాబాద్ స్టేట్లో 1953లో దీనిని ప్రతిపాదిస్తే, ఆ తరువాత దశాబ్దానికి 1963లో శిలా ఫలకం పడింది. 75 శాతం డిపెండెబిలిటీపై సుమారు 156 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని, దీంతో 112 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో జలాశయాన్ని నిర్మించి, 196 టీఎంసీల నీటిని వినియోగించుకొనేలా రూపకల్పన చేశారు. 1964లో రూ.40 కోట్ల అంచనా వ్యయంతో మొదలైన పనులు రెండు దశాబ్దాలపాటు కొనసాగాయి.
అంచనా వ్యయం రూ.15 వేల కోట్లకు పెరిగింది. పనులు పూర్తయినా ఏనాడూ కనీసం సగం ఆయకట్టుకు కూడా నీళ్లు అందించలేదు. కాలువలు పూర్తిచేయలేదు. నీటిని విడుదల చేసేనాటికే జలాశయం సామర్థ్యం 12 టీఎంసీలు తగ్గింది. కాలువల నిర్మాణం పూర్తయ్యేనాటికి మరో 10 టీఎంసీల సామర్థ్యం తగ్గింది. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1లో ఎల్ఎండీకి ఎగువన ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాలువ 0-146 కిలోమీటర్ల వరకు 4,62,920 ఎకరాలు, దిగువన కాకతీయ కెనాల్ 146-284 కిలోమీటర్ వరకు 5,05720 ఎకరాలు కలిసి మొత్తం 9,68,640 ఎకరాల ఆయకట్టుకు నీరందించాల్సి ఉన్నది. అందులో 1/3 తరి, 2/3 మెట్టపంటలకు నీరందించేలా ప్రాజెక్టును డిజైన్ చేశారు. కానీ ఉమ్మడి పాలనలో ఏనాడూ స్జేజ్ 1లో మొత్తం ఆయకట్టులో రెండొంతుల భాగం నీరందించిన దాఖలాల్లేవు.
ఎస్సారెస్పీ మొదటి దశ ఆయకట్టుకే దిక్కు లేదంటే, 1984లో ఎస్సారెస్పీ రెండో దశకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ, సీఎం ఎన్టీఆర్ శంకుస్థాపన చేశారు. కాకతీయ కాలువను 284 కిలోమీటరు నుంచి 347 కిలోమీటరుకు విస్తరణ చేపట్టారు. ఆ తరువాత అది మూసీలో కలుస్తుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు రెండు పర్యాయాలు 1996, 2002లో శంకుస్థాపన చేశారు. అయినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నాటికి పనులు పూర్తికాలేదు. ఎప్పుడైనా ప్రాజెక్టులోకి వరద వచ్చినా, పూడిపోయిన కాలువలతో పదహారు లక్షల ఎకరాల ఆయకట్టులో నాలుగైదు లక్షల ఎకరాలకు నీళ్లు పారడమే గగనమైంది.
ఒడిసిపడుతున్న నీటిని అంతే సమర్థవంతంగా వినియోగించుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహాలను అమలు చేస్తున్నది. తొలుత వారాబందీ విధానాన్ని ప్రవేశపెట్టింది. వారం విడచి వారం సాగునీరందించింది. ఎస్సారెస్పీ నుంచే టెయిల్ టు హెడ్ విధానానికి శ్రీకారం చుట్టింది. 2016-17లో ప్రాజెక్టు స్టేజ్ 1 క్రింద ఉన్న చివరి ఆయకట్టుకు నీరందించాలనే ఉద్దేశంతో డీ 83 కాలువను పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని టెయిల్ టు హెడ్ పద్ధతిని అమలు చేసింది. ఎస్సారెస్పీ చరిత్రలో తొలిసారి 11,12, 064 ఎకరాలకు సాగునీటిని అందించింది. 2018 నుంచి ఇదే విధానాన్ని ఎస్సారెస్పీ రెండో దశ ఆయకట్టులో అమలు చేస్తూ అద్భుత ఫలితాలను సాధిస్తున్నారు. మరోవైపు ఆయకట్టు పరిధిలోని ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీలు, మైనర్ల ద్వారా నీటిని చెరువుల్లోకి పంపుతున్నారు. అలా రెండో దశ ఆయకట్టులోని చిట్టచివరి చెరువైన సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం మాచారం లోని రాయి చెరువుకు నీటిని తరలించారు.
ఎస్సారెస్పీ ప్రాజెక్టు ప్రతిపాదిత లక్ష్యాన్ని నెరవేర్చడమే కాదు.. ఆయకట్టుకు శాశ్వత భరోసాను కల్పించారు సీఎం కేసీఆర్. శ్రీరాంసాగర్ రిజర్వాయర్ నిల్వ సామర్థ్యం 112 నుంచి 90 టీఎంసీల దిగువకు తగ్గిపోయింది. ఎగువన మహారాష్ట్ర నుంచి ప్రవాహాలు గణనీయంగా తగ్గిపోయాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ఆయకట్టుకు నీటి ఢోకా లేకుండా ఉండేలా ఎస్సారెస్పీని నేడు తీర్చిదిద్దారు. దాదాపు రూ.2 వేల కోట్లతో ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకాన్ని చేపట్టి పూర్తి చేశారు. తగినంత వరద రాని రోజుల్లో.. కాళేశ్వరం వరద కాల్వ నుంచి శ్రీరాజరాజేశ్వర జలాశయానికి తరలించే ప్రాణహిత జలాలను, వరద కాలువ నుంచి వెనక్కి పంపింగ్ చేసి శ్రీరాంసాగర్ జలాశయంలో పోసేలా పథకాన్ని రూపొందించారు. కాళేశ్వరం అందుబాటులోకి వచ్చే సమయానికి పునర్జీవ పథకాన్ని కూడా రెండు దశల ఎత్తిపోతలకు సిద్ధం చేశారు. అంతేకాదు వరద కాలువ సైతం 1.5 టీఎంసీల జలాలతో 122 కిలోమీటర్ల పొడవున రిజర్వాయర్గా మార్చివేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్.. తెలంగాణ సాగు నీటి ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుపై ఇంజినీర్లతో సుదీర్ఘ మేధోమథనం నిర్వహించారు. ప్రతిపాదిత ఆయకట్టు మొత్తానికి రెండు పంటలకు సాగునీరందించేందుకు ప్రణాళికలు రూపొందించారు. తొలుత ఎస్సారెస్పీ ప్రధాన కాలువలతోపాటు, డిస్ట్రిబ్యూటరీల ఆధునీకరణకు శ్రీకారం చుట్టారు. రూ.2,000 కోట్లతో కాకతీయ కెనాల్తోపాటు ఉపకాలువలకు సైతం మరమ్మతులు, లైనింగ్ చేయించారు. దీంతో కాలువల్లో నీటి ప్రవాహ సామర్థ్యం గణనీయంగా పెరిగింది. కాకతీయ కాలువ ప్రవాహ స్థామర్థ్యం 9 వేల క్యూసెక్కులు కాగా, ఉమ్మడి పాలనలో ఏనాడూ 4 వేల క్యూసెక్కులకు మించి రాని దుస్థితి. తెలంగాణ ప్రభుత్వం కాలువల ఆధునీకరణ చేపట్టిన అనంతరం ప్రస్తుతం కాకతీయ కెనాల్ ప్రవాహ సామర్థ్యం 8 వేల క్యూసెక్కులకు చేరుకున్నది. ఫలితంగా నేడు చివరి ఆయకట్టుకు వరకూ నీరందుతున్నది. నేడు కాకతీయ కాలువ 347 కిలోమీటర్ల పొడవునా సజీవధారగా పారుతున్నది. గతంలో వానకాలం, యాసంగి కలిపి ఎస్సారెస్పీ కింద 9 లక్షల ఎకరాలు కూడా సాగుకానీ పరిస్థితి ఉండగా, నేడు ఒక్క పంట కాలంలోనే ఆ లక్ష్యాన్ని చేరుకొంటున్నది. ఈ ఏడాది రెండు పంటలకు కలిపి 24,30,753 ఎకరాలకు సాగునీరందించడం విశేషం.
యాసంగి పంటల కోసం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి దిగువన ఉన్న ఆయకట్టుకు కాకతీయ కాలువ ద్వారా శుక్రవారం సాయంత్రం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఈ చక్రపాణి మాట్లాడుతూ.. యాసంగి కోసం మొత్తం 63 టీఎంసీల నీటిని కేటాయించినట్టు చెప్పారు. కాకతీయ కాలువ ద్వారా 5,500 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తామని తెలిపారు. ప్రస్తుతం 2,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు. క్రమంగా నీటి విడుదల సామర్థ్యాన్ని పెంచుతామని అన్నారు. వారబందీ ప్రకారం నీటి విడుదల చేస్తున్నామని తెలిపారు. కాలువ ద్వారా వదులుతున్న ప్రతి నీటి చుక్కను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.