హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): బీసీలను నిలువునా వంచించిన పార్టీ బీజేపీ అని, ఆ పార్టీకి బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కులేదని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. బీసీలను మరోసారి దగా చేసేందుకు బీజేపీ బీసీ డిక్లరేషన్ చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా మోదీని చెప్పుకున్నా బీసీలకు ఏం చేశారని ప్రశ్నించారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయమంటే చేయనివారు బీసీ డిక్లరేషన్ చేయటం విడ్డూరంగా ఉన్నదని మండిపడ్డారు. బీజేపీ డిక్లరేషన్ను రాష్ట్రంలోని బీసీలెవరూ నమ్మరని ఆయన తేల్చిచెప్పారు.