ఖమ్మం, నవంబర్ 17: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నెలనెలా మంత్రి పొంగులేటికి చెల్లించే కాంట్రాక్టు బిల్లుల్లో ఒక నెల బిల్లును ఫీజు రీయింబర్స్మెంట్ కింద విడుదల చేసినా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు, యజమానులు సంతోషంగా ఉంటారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ను పూర్తిగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడు రాకేశ్ దత్తా చేపట్టిన పాదయాత్రను సోమవారం ఖమ్మం నగరంలోని జడ్పీ సెంటర్లో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ప్రైవేటు కళాశాలల యజమానులు ఆర్జేసీ కృష్ణ, బొమ్మ రాజేశ్వరరావుతో కలిసి శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు.
అంతకుముందు జడ్పీ ఆవరణ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థుల పట్ల సోయిలేదని అన్నారు. కేసులు ఎలా పెట్టాలి? ప్రభుత్వాన్ని ఎలా కాపాడుకోవాలి? ఇచ్చిన హామీలను ఎలా తుంగలో తొక్కాలి? అనేది మాత్రమే రేవంత్రెడ్డి ఆలోచన చేస్తున్నారని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ను విడుదల చేయకుండా విద్యార్థుల భవిష్యత్ను అంధకారం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రెండేళ్లుగా ప్రైవేటు కళాశాలలకు దాదాపు రూ.12 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని, తొమ్మిది నెలలుగా సిబ్బందికి జీతాలు లేవని ఆరోపించారు. ప్రైవేటు కళాశాలలకు దాదాపు 18 వందల కోట్లకు టోకెన్లు ఇచ్చినా డబ్బులు ఇవ్వలేదని మండిపడ్డారు. యాజమాన్యాలు ధర్నా చేస్తే రెండుసార్లు కమిటీలు వేసి చేతులు దులుపుకొన్నారు తప్ప డబ్బులు మాత్రం ఇవ్వలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికే దాదాపు రూ.10 కోట్లు బిల్లులు వచ్చాయని, ఆయనకు సంబంధించిన కంపెనీకి వేల కోట్లు అప్పగిస్తున్నారని ఆరోపించారు. పొంగులేటిది ఒక బిల్లు ఆపితే తెలంగాణలోని విద్యార్థులందరి జీవితాలు బాగుపడతాయని అన్నారు.
మంత్రుల బినామీలకు మాత్రం డబ్బులు ఉంటాయి కానీ విద్యార్థులకు ఇవ్వడానికి మాత్రం డబ్బులు ఉండవా? అని ప్రశ్నించారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. కళాశాలల యజమానులకు కేవలం రూ.300 కోట్లు మాత్రమే విడుదల చేశారని అన్నారు. ఫలితంగా విద్యార్థుల భవిష్యత్ ఆగమ్యగోచరంగా మారిందని తెలిపారు. ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. గతంలో విద్యార్థులు తమ సమస్యల పరిషారం కోసం రోడ్డెకిన సందర్భాలు లేవని, ఇది విద్యార్థుల్లో నెలకొన్న తీవ్ర ఆందోళనకు నిదర్శనమని పేరొన్నారు.