మహబూబ్నగర్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంపై అవాకులు, చెవాకులు పేలితే ప్రజలే మిమ్మల్ని పాతాళానికి తొక్కేస్తారని బీజేపీ నాయకులను ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి కూడా ఇక్కడ పాదయాత్రలు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సుష్మాస్వరాజ్, నితిన్ గడ్కరీ పాలమూరులో జరిగిన ఎన్నికల సమావేశాల్లో పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామన్నారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి ఏడేళ్లు దాటినా దాని ఊసేలేదని విమర్శించారు. గతంలో హామీ ఇచ్చిన బీజేపీ నేతలు ఇప్పుడు ఈ అంశంపై తమ వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఎల్ఐసీ, రైల్వే వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నామని చెప్పేందుకే పాదయాత్ర చేస్తున్నావా అని బండి సంజయ్ను ఉద్దేశించి అన్నారు. ఏడేండ్లలో జరిగిన అభివృద్ధి ఏమిటో పాదయాత్రలో ప్రజలను అడిగి తెలుసుకోవాలని సూచించారు. జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడైన వ్యక్తి మాట్లాడుతున్న భాష చూసి జనం నోట వేలేసుకుంటున్నారని అన్నారు. మహారాష్ట్రంలో కేంద్ర మంత్రి నారాయణ రాణే అక్కడి సీఎంపై తప్పుగా మాట్లాడినందుకు అరెస్టు చేసి జైల్లో వేసిన విషయాన్ని ప్రతిపక్షాలు గుర్తుంచుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పనితీరు బాగుందని డజన్ మంది కేంద్ర మంత్రులు కితాబునిచ్చిన విషయాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు మర్చిపోయినట్టున్నారని అన్నారు.