హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఎల్ఐసీలో వాటాల ఉపసంహరణకు ఉపక్రమిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్మిశ్రా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 29 కోట్ల పాలసీదారులకు ఉత్తమ సేవలందిస్తున్న ఎల్ఐసీ 66 ఏండ్ల చరిత్రలో ఇంతటి దుర్మార్గ విధానాలను చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్ఐసీ హైదరాబాద్ డివిజన్ పరిధిలోని మహబూబ్నగర్లో శనివారం ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు- ప్రభుత్వ రంగ సంస్థలపై ప్రభావం’ అన్న అంశంపై నిర్వహించిన కార్యక్రమానికి శ్రీకాంత్ మిశ్రాతోపాటు యూనియన్ ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూ.42 లక్షల కోట్ల ఆస్తులు కలిగిన ఎల్ఐసీని అమ్మకానికి పెడితే ఊరుకొనే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. కేంద్రం దురుద్దేశంతో ఎల్ఐసీని బలహీనపరిచేందుకు 3.5 శాతం వాటాలను ఉపసంహరిస్తూ స్టాక్ మారెట్లో అమ్మిందని అన్నారు. ఐఆర్డీఏఐ ప్రతిపాదించే అనేక అంశాలు పాలసీదారులతోపాటు ఏజెంట్ల భవితవ్యాన్ని నిర్వీర్యం చేసేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర జాబితాలోని విద్యను ఉమ్మడి జాబితాలోకి మార్చిన కేంద్రం.. వెనుకబడిన వర్గాలకు విద్యావకాశాలను దెబ్బతీస్తున్నదని అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరిస్తూ ప్రజలకు బ్యాంకింగ్ సేవలను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నదని వారు ధ్వజమెత్తారు.