పెద్దపల్లి, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ దూరదృష్టి, అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా అమలు చేస్తున్న పథకాలతో.. తెలంగాణలో వ్యవసాయం పండుగలా సాగుతున్నది. దీంతో పలు రాష్ర్టాల నుంచి కుటుంబ సమేతంగా వలస వచ్చి ఇక్కడ జీవనోపాధి పొందుతున్నాయి. ఏటా వర్షాకాలం, యాసంగిలో ఏదో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. అదేక్రమంలో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నరసరావు పేట జిల్లా పెద్దకూరపాడు మండలం గారపాడు గ్రామానికి చెందిన కుంభ శ్రీకాంత్ తన భార్యతో కలిసి తెలంగాణకు వలస వచ్చాడు. ఏటా వర్షాకాలం, యాసంగి సీజన్లలో రైతులు పండించిన ధాన్యాన్ని ఆరబోసుకునేందుకు, ధాన్యంపై కప్పుకునేందుకు పరదాలు అవసరమవుతుండగా.. వాటిని తయారు చేసి అమ్ముతున్నాడు. రైతులు సంచులు తెచ్చకుంటే కుట్టి ఇస్తున్నాడు.
లేకుంటే తన వద్ద ఉన్న పరదాలను అద్దెకు ఇస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. ఇక్కడ వ్యవసాయం పండుగలా సాగుతుండటంతో తమకు ఉపాధి దొరుకుతున్నదని శ్రీకాంత్ వివరిస్తున్నాడు. ఇలా జనగామ జిల్లాలో ఎనిమిదేండ్లపాటు జీవనం సాగించిన శ్రీకాంత్.. నిరుడు రాంపల్లికి వచ్చి ఉపాధి పొందుతున్నట్టు చెప్పాడు. శ్రీకాంత్ మాదిరిగానే ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల నుంచి తెలంగాణలోని గ్రామాల్లోకి వలస వచ్చి పరదాలు కుట్టే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. పెద్దపల్లి జిల్లాలోని కాల్వశ్రీరాంపూర్, ఓదెల, సుల్తానాబాద్, ముత్తారం, మంథని, ధర్మారం మండలాల్లో రైతుల వ్యవసాయ అవసరాలను తీర్చుతూ సీజనల్గా ఉపాధి పొందుతూ కడుపునింపుకుంటున్నారు.