గంగాధర, డిసెంబర్ 31: తన కూతురు, మనుమడు, మనుమరాలి మరణానికి అల్లుడే కారణమని అత్త ఠాణాలో ఫిర్యాదు చేయగా.. తీవ్ర మనస్తాపానికి గురైన అల్లుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. శనివారం జరిగిన విషాద ఘటనతో కరీంనగర్ జిల్లా గంగాధరలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగాధరకు చెందిన వేముల శ్రీకాంత్, మమత దంపతులు. వీరికి కొడుకు అద్వైత్, కూతురు అమూల్య ఉన్నారు. శ్రీకాంత్ ప్రైవేట్ అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. గత నవంబర్ 16న కొడుకు అద్వైత్, అదే నెల 29న కూతురు అమూల్య, డిసెంబర్ 28న భార్య మమత అంతుచిక్కని వ్యాధితో మరణించారు. పోలీసులు శాంపిల్స్ సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. వీరి మృతికి శ్రీకాంతే కారణమని అతడి అత్త రమ అదేరోజు గంగాధర ఠాణాలో ఫిర్యాదు చేసింది. అలాగే పెండ్లినాడు ముట్టజెప్పిన లాంఛనాలు తిరిగివ్వాలని అత్తింటివారు అడిగారు. దీంతో కలత చెందిన శ్రీకాంత్ శుక్రవారం రాత్రి సోడియం హైడ్రాక్సైడ్ గుళికలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శ్రీకాంత్ రక్తపు వాంతులు చేసుకుంటున్న విషయాన్ని అతని బావ దేవేందర్ గుర్తించి వెంటనే కరీంనగర్లోని ఓ పైవేట్ దవాఖానలో చేర్పించాడు. శ్రీకాంత్ పరిస్థితి విషమించి శనివారం తెల్లవారుజామున మరణించాడు. అత్త రమ, బావమరుదులు ప్రశాంత్, మహేశ్ వేధింపులు భరించలేక తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నట్టు శ్రీకాంత్ తండ్రి లక్ష్మీపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు గంగాధర ఎస్సై తెలిపారు.