మణికొండ, మార్చి 1 : కోకాపేట్లోని శ్రీశారదా పీఠం భూముల విషయంలో తప్పు జరిగిందని, కమ్యూనికేషన్ గ్యాప్తో జరిగిన ఈ విషయం తెలిసిన వెంటనే పొరపాటును సరిదిద్దుకున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టంచేశారు. తమ ప్రభుత్వానికి భేషజాలు లేవని, తప్పులు దొర్లితే వెంటనే సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఆదివారం కోకాపేట్లోని శారదా పీఠాన్ని సందర్శించి, అకడి రాజశ్యామల అమ్మవారి ఆలయం, ఇతర నిర్మాణాలను మంత్రి పరిశీలించారు. అనంతరం ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమాచార లోపం వల్లే గందరగోళం తలెత్తిందని, ఆ భూములు పీఠానికే చెందుతాయని, అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదని స్పష్టంచేశారు. పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రభుత్వం తరఫున అన్నిరకాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాపు ఘాట్ అభివృద్ధి విషయంలో ప్రజాభీష్టం మేరకే ముందుకెళ్తామని, తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని స్థానికులకు మంత్రి శ్రీధర్బాబు హామీ ఇచ్చారు.
ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ మాట్లాడుతూ.. కోకాపేటలో నిర్మితమవుతున్న రాజశ్యామల అమ్మవారి దేవాలయాన్ని మరోచోటకు తరలిస్తారనే వార్త మాకు మీడియా ద్వారానే తెలిసిందని, వెంటనే ముఖ్యమంత్రికి లేఖ ద్వారా అర్జీ పెట్టామని తెలిపారు. విశాఖ శ్రీశారదాపీఠం ఆంధ్రప్రదేశ్లో కొలువుదీరి ఉంటే, అమ్మవారి ఆశీస్సులు తెలంగాణ ప్రజలకు కూడా అవసరమనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండెకరాల భూమిని కేటాయించారని స్వామీజీ గుర్తుచేశారు. ఈ ప్రాంతవాసులకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలనే సత్సంకల్పంతో ఆలయ నిర్మాణం శరవేగంగా కొనసాగుతుందని తెలిపారు. ఆదివారం మంత్రి శ్రీధర్బాబు తనను కలిశారని, కమ్యూనికేషన్ గ్యాప్తోనే ఆలయాన్ని తొలగిస్తారన్న నిర్ణయం తీసుకున్నారని, దీనిపై ముఖ్యమంత్రి వివరణ తర్వాత ఈ భూములు శారదాపీఠానివేనని స్పష్టంచేశారని వెల్లడించారు. ఎనిమిది గంటల వ్యవధిలోనే సమస్యను సానుకూలంగా పరిష్కరించడం సంతోషంగా ఉందని తెలిపారు.