హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ ) : లండన్లోని సట్టన్ పట్టణంలో శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో 34 ఆర్య వైశ్య కుటుంబాలు భక్తిశ్రద్ధలతో సామూహిక పూజ నిర్వహించాయి. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దక్షిణ భారతదేశంలోని ప్రముఖ దేవత. శక్తి స్వరూపిణి అయిన వాసవి అమ్మవారు శక్తి, ఆరోగ్యం, సంపదకు ప్రతిరూపంగా భక్తులు కొలుస్తారు. సాంప్రదాయ రీతిలో అలంకరించిన వేదికపై శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి గణేశ పూజ, వాసవి అభిషేకం, అధాంగ పూజ, షోడశోపచార పూజ, అష్టోత్తర పూజ, కుంకుమ పూజ తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
పిల్లలకు వాసవి కథను చదివి వినిపించగా, మహిళలు వాసవి పారాయణం, చాలీసా పఠించారు. భక్తులు భజనలు, కీర్తనలు ఆలపించి, అమ్మవారి కృపను కోరారు. వేడుకల అనంతరం మహా ప్రసాద వితరణ చేశారు. ఈ వేడుకల ద్వారా పిల్లలకు మన సంస్కృతి, సంప్రదాయాలను నేర్పించడానికి ఒక మంచి అవకాశం లభించిందని నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకల విజయవంతానికి కృషి చేసిన వీర ప్రసాద్ సూర, కృష్ణ కాకుమాని, రవి బండారు, రవి శ్రీరంగం, శ్రీకాంత్, ఇతర సభ్యులను నిర్వాహక కమిటీ అభినందించింది.