భద్రాచలం: భద్రాచలంలో (Bhadrachalam) సీతారాముల (Sri Seetha Ramachandra swamy) వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీరామ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక (Pushkara samrajya Pattabhishekam) మహోత్సవం జరుగుతున్నది. మిథిలా స్టేడియంలో (Mithila stadium) పట్టాభిషేక కార్యక్రమాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలవరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. పట్టాభిషేకానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai), మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavathi Rathod) పాల్గొన్నారు. సీతారాములకు గవర్నర్ తమిళిసై పట్టువస్త్రాలు సమర్పించారు.
భక్తులు భారీగా తరలిరావడంతో మిథిలా ప్రాంగణం నిండిపోయింది. భక్తులకు ఎలాంటి ఇంబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. కాగా, రామచంద్రుడికి మినహా మరే ఇతర దైవ స్వరూపానికీ పట్టాభిషేక వేడుక నిర్వహించరు. ప్రతి పుష్కరానికి అంటే పన్నెండేండ్లకొకసారి శ్రీరామ సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకాన్ని, 60 ఏండ్లకొకసారి ప్రభవనామ సంవత్సరంలో శ్రీరామ మహా సామ్రాజ్య వైభవ పట్టాభిషేకాన్ని నిర్వహిస్తారు. 1999లో శ్రీరామునికి ప్రథమ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకాన్ని, 2011లో రెండో పుష్కర పట్టాభిషేకాన్ని నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్నది మూడోది.