భద్రాచలం: శ్రీసీతారాముల కల్యాణం (Seetha Ramula Kalyanam) కన్నుల పండుగగా జరిగింది. ఇక రామయ్య పట్టాభిషేకానికి (Pushkara Pattabhishekam) వేళయింది. భద్రాచలంలోని (Bhadrachalam) మిథిలా స్టేడియంలో (Mithila Stadium) శ్రీరాముడి పుష్కర సామ్రాజ్య మహా పట్టాభిషేకం శుక్రవారం అధికారులు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఈ మహత్తర వేడుక ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జరుగనున్నది. 2011లో జరిగిన పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకానికి ఐదు హోమ గుండాలు ఏర్పాటు చేయగా ఈసారి వాటి సంఖ్యను 12కు పెంచాలని వైదికులు నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి సత్యవతి రాథోడ్ హాజరుకానున్నారు.
కాగా, రామచంద్రుడికి తప్ప మరే ఇతర దైవ స్వరూపానికీ పట్టాభిషేక వేడుక నిర్వహించరు. రామపట్టాభిషేక వైభవం ఐదు విధాలుగా వర్ధిల్లుతుంది. శరన్నవరాత్రుల్లో విజయదశమినాడు, శ్రీమద్రామాయణ నిత్యపారాయణను అనుసరించి ప్రతినెలా పుష్యమి నక్షత్రంనాడు పట్టాభిషేకం నిర్వహిస్తారు. శ్రీరామనవమి మరుసటి రోజు శ్రీరామ మహా పట్టాభిషేకం జరుపుతారు. ప్రతి పుష్కరానికి అంటే పన్నెండేండ్లకొకసారి శ్రీరామ సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకాన్ని, 60 ఏండ్లకొకసారి ప్రభవనామ సంవత్సరంలో శ్రీరామ మహా సామ్రాజ్య వైభవ పట్టాభిషేకాన్ని నిర్వహిస్తారు. 1999లో శ్రీరామునికి ప్రథమ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకాన్ని, 2011లో రెండో పుష్కర పట్టాభిషేకాన్ని నిర్వహించారు. ఈసారి మూడో పుష్కర పట్టాభిషేకం నిర్వహిస్తారు. జానకీరాముడికి మళ్లీ పాలన అప్పగించి, ఆయన చల్లటి పాలనలో ప్రజలు ఆనందంగా జీవనం సాగించాలని ఈ వేడుక నిర్వహిస్తారు.