భద్రాచలం: సీతమ్మను మనువాడిని భద్రాచల (Bhadrachalam) రామయ్య నేడు పటాభిషిక్తుడు కానున్నాడు. శ్రీరామ నవమి (Sriramanavami) భద్రాచల పుణ్యక్షేత్రంలో బుధవారం శ్రీసీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. గురువారం ఉదయం 10.30 గంటల నుంచి 12.30 వరకు మిథిలా స్టేడియంలో రాములవారికి మహా పట్టాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ దంపతులు హాజరుకానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారిని గవర్నర్ రాధాకృష్ణన్ పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.
భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి వారి కల్యాణం బుధవారం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ‘శ్రీరామ.. జయరామ.. జయజయ రామ’ నామస్మరణతో భద్రగిరి మార్మోగింది. కల్యాణ ఘడియ కోసం రెండు రోజులుగా ఎదురుచూస్తున్న భక్తజనం రాముడిని పెండ్లి కుమారుడిగా, సీతమ్మ తల్లిని పెండ్లికుమార్తెగా దర్శనం చేసుకొని తరించారు. భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో సీతారాముల కల్యాణం నేత్రపర్వంగా సాగింది. భక్తులకు సీతారామ కల్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు రెండు కనులూ చాలలేదు. అర్చకస్వాముల వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ నయనానందకరంగా సాగిన స్వామివారి కల్యాణ మహోత్సవం భక్తులను ఆధ్యాత్మిక ఒడిలో ఓలలాడించింది.
ఉదయం 10 గంటలకు ప్రారంభమైన కల్యాణ క్రతువు మధ్యాహ్నం 12:30 గంటల వరకు కొనసాగింది. శ్రీరాముడు, సీతాదేవి వధూవరులుగా ఆశీనులైన మిథిలా స్టేడియం వైకుంఠాన్ని తలపించింది. సీతమ్మ వారికి కల్యాణం రోజు దేశంలో ఎక్కడైనా పుస్తెల తాడులో రెండు సూత్రాలను మాత్రమే ధరింపచేస్తారు. కానీ.. భద్రాచలంలో కల్యాణ మహోత్సవంలో మాత్రం సీతమ్మ వారికి శ్రీరాముడు కట్టే పుస్తెల తాడులో మూడు సూత్రాలు ఉంటాయి. జనక , దశరథ మహారాజులు చేయించిన పుస్తెలతో పాటు రామదాసు సీతమ్మను తన కుమార్తెగా భావించి చేయించిన మూడో సూత్రాన్ని కలిపి రామయ్య తండ్రి సీతమ్మతల్లి మెడలో మాంగళ్యధారణ గావించారు. సర్కారు తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సీతారాముల వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. దీంతో ముత్యాల తలంబ్రాలు సమర్పించిన తొలి సీఎస్గా రికార్డుల్లో నిలిచారు.