Bhadradri | భద్రాద్రి కొత్తగూడెం : శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకతో గురువారం భద్రాద్రి దివ్యక్షేత్రం పులకించిపోయింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్టించిన రామయ్య భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. కల్యాణమూర్తులు శోభాయాత్రగా మిథిలా ప్రాంగణానికి చేరుకోగానే, ఆ ప్రాంతమంతా శ్రీరామ నామస్మరణతో మార్మోగిపోయింది. గోదావరి నుంచి తీసుకొచ్చిన పుణ్య జలాలను భక్తులపై చల్లి ఆశీస్సులు అందించారు. సీతమ్మతో కలిసి స్వామివారు రాజాధిరాజుగా దర్శనమిచ్చారు. ఖడ్గం చేతబట్టి కిరీటాన్ని ధరించిన రాములవారిని చూసి భక్తజనం మురిసిపోయింది.
శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవానికి రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాన ఆలయంలో గవర్నర్ ప్రత్యేక పూజలు చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, ఆలయ ఈవో రమాదేవి గవర్నర్కు స్వాగతం పలికారు. అర్చకులు ఆయనకు వేదాశీర్వచనాలిచ్చి తీర్థ ప్రసాదాలు, జ్ఞాపికను అందించారు. ఆ తర్వాత గవర్నర్ మిథిలా ప్రాంగణానికి చేరుకుని మహా పట్టాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు గవర్నర్.