హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ బ్రమరాంబ మల్లికార్జున స్వామి రథోత్సవం నేత్ర పర్వంగా సాగింది. రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను శోభాయమానంగా అలంకరించి రథంపై అధిష్టించారు.
జగద్గురు పీఠాధిపతి శివాచార్య మహాస్వామి, జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి, ధర్మకర్తల మండలి అధ్యక్షుడు చక్రపాణిరెడ్డి, ఈవో ఎస్ లవన్నస్వామి అమ్మవార్లకు గుమ్మడికాయలు, కొబ్బరికాయలు సమర్పించారు. భక్తజనం శివనామస్మరణల నడుమ శ్రీగిరి పురవీధుల్లో ఆది దంపతుల రథోత్సవం రమణీయంగా జరిగింది. ఈ సందర్భంగా కళాకారుల నృత్యాలు, ఢమరుక నాదాలు, డోలు విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి.