హైదరాబాద్: యాదాద్రి పుణ్యక్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ యాదాద్రీశుడి తిరుకల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు బాలాలయంలో లక్ష్మీనారసింహునికి కల్యాణం జరుగనుంది. లోకసంరక్షణ, శాంతి కోసం ఈ కల్యాణోత్సవం నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తిచేశారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హాజరుకానున్నారు.
కాగా, భక్తుల సౌకర్యార్ధం కొండకింద కూడా కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఇవాళ రాత్రి యాదగిరిగుట్టలోని పాత జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో కల్యాణం నిర్వహిస్తారు. స్వామివారి కల్యాణం వీక్షించేందుకు ఎల్ఈడీ టీవీలను ఏర్పాటుచేశారు.