యాదగిరిగుట్ట, జనవరి27: పరమ పవిత్ర శ్రీవైష్ణవ స్తోత్రాలతో తేజరిల్లుతున్న శ్రీమంతమైన మంత్ర పేటిక ‘శ్రీలహరి’ గ్రంథాన్ని యాదగిరిగుట్టలో స్వామివారిని దర్శించుకునే భక్తులకు ఆలయ అధికారులు అందిస్తున్నారు. శనివారం బ్రేక్ దర్శనంలో స్వామివారి దర్శించుకునేందుకు వచ్చిన 400 మంది భక్తులకు ఈ గ్రంథాన్ని అందించినట్టు ఆలయ అధికారి అశ్విని తెలిపారు.
టికెట్ కొనుగోలు చేసే సెంటర్లో బ్రేక్ దర్శనం, అభిషేక టికెట్తోపాటు ఈ గ్రంథాన్ని అందిస్తున్నారు. ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్ రచించి, సంకలనం చేసిన ‘శ్రీలహరి’ గ్రంథాన్ని భోగి పండుగ రోజున ఆలయంలో ఆవిష్కరించారు. రెండు వారాలుగా బ్రేక్ దర్శనం, అభిషేకంలో పాల్గొనే భక్తులకు ఈ గ్రంథాన్ని అందిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.