భద్రాచలం: దక్షిణాది అయోధ్య భద్రాచల రాములవారి సన్నిధిలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో నాలుగో రోజైన నేడు అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అమ్మవారికి పంచామృతాలతో విశేష స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఉదయం 10 గంటలకు భక్తులకు ధనలక్ష్మి అలంకార దర్శనం కల్పించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మహా నివేదన చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి కుంకుమ అర్చన, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పారాయణం జరుగనుంది.
ఇక వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. భద్రకాళి అమ్మవారు హంస వాహనంపై ఊరేగనున్నారు.