తెలంగాణ ఫుడ్స్ చైర్మన్గా మేడే రాజీవ్సాగర్
ఉర్దూ అకాడమీ చైర్మన్గా ఖాజా ముజీబుద్దీన్
హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 30 (నమస్తే తెలంగాణ)/కామారెడ్డి: నామినేటెడ్ పదవుల్లో మరోసారి తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ప్రభుత్వం గురువారం మూడు కార్పొరేషన్లకు కొత్త చైర్పర్సన్లను నియమించింది. అధికార భాషా సంఘం అధ్యక్షురాలిగా నారపల్లికి చెందిన మంత్రి శ్రీదేవి నియమితులయ్యారు. తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్గా మేడే రాజీవ్సాగర్, ఉర్దూ అకాడమీ చైర్మన్గా మహమ్మద్ ఖాజా ముజీబుద్దీన్ను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీదేవి 2004లో టీఆర్ఎస్లో చేరి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2004 నుంచి టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్నారని.. తండ్రిలాంటి కేసీఆర్ తన సేవలను గుర్తించి భాషా గొప్పతనాన్ని చాటే అవకాశం ఇచ్చినందుకు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. మేడే రాజీవ్ సాగర్ తెలంగాణ జాగృతి నిర్మాణంలో ముఖ్య భూమిక పోషించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో తెలంగాణ జాగృతిని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లి తెలంగాణవాదాన్ని వినిపించారు. 2006-2008 వరకు తెలంగాణ జాగృతి కోశాధికారిగా పనిచేశారు. 2008 నుంచి 2014 వరకు తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2014 నుంచి జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ముజీబుద్దీన్ ప్రస్తుతం కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. 1995-2000, 2000-2005 మధ్య రెండుసార్లు మున్సిపల్ కౌన్సిలర్గా, 2013-2019 మధ్య నిజామాబాద్ డీసీఎంఎస్ చైర్మన్గా, 2017-2022 టీఆర్ఎస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా పనిచేశారు.