హైదరాబాద్: రామానుజ విగ్రహావిష్కరణకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను (Governor Tamilisai) చినజీయర్ స్వామి ఆహ్వానించారు. హైదరాబాద్లోని రాజ్భవన్కు వెళ్లిన చినజీయర్ స్వామి.. సమతామూర్తి విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా గవర్నర్కు ఆహ్వానం అందించారు. నగర శివారుల్లోని ముచ్చింతల్ ఆశ్రమంలో అతిపెద్ద సమతామూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ పంచలోహ విగ్రహాన్ని ఫిబ్రవరి 5న ఆవిష్కరించనున్నారు.
రామానుజాచార్యుల సహస్త్రాబ్ధి ఉత్సవాల్లో భాగంగా.. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు 1,035 కుండ శ్రీ లక్ష్మీ నారాయణ మహాక్రతువు, 108 దివ్యదేశ ప్రతిష్ట కుంభాభిషేకం నిర్వహించనున్నారు. దీంతోపాటు.. స్వర్ణమయ శ్రీ రామానుజ ప్రతిష్ట చేయనున్నారు.
ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ జరగనుంది. ఫిబ్రవరి 14న పూర్ణాహుతిలో రాష్ట్రపతి పాల్గొననున్నారు. ఇప్పటికే చినజీయర్ స్వామి దేశవ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మిక, రాజకీయ, సినీ ప్రముఖులను ఆహ్వానించారు.