సికింద్రాబాద్, సెప్టెంబర్ 11: రైల్వేలను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ (ఎస్ఆర్ఈఎస్) అధ్యక్షుడు ప్రభాకర్ ఆండ్రూస్ ధ్వజమెత్తారు. ఈ కుట్రలను వ్యతిరేకిస్తూ ఎస్ఆర్ఈఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 13 నుంచి 18 వరకు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. శనివారం ఆయన సికింద్రాబాద్లోని ఎస్ఆర్ఈఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రైళ్లు, రైల్వే స్టేషన్లు, రైల్వేలకు చెందిన ఇతర ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు మోదీ సర్కార్ ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని, కార్మిక వ్యతిరేక విధానాలకు కేంద్ర ప్రభుత్వం కేరాఫ్ అడ్రస్గా మారిందని దుయ్యబట్టారు. ఇప్పటికే విజయవాడ, నెల్లూరు స్టేషన్లను ప్రైవేటీకరించిందని చెప్పారు. రైళ్లలో ప్రయాణించేవారిలో దాదాపు 75 శాతం మంది సామాన్యులేనని, ప్రైవేటీకరణతో వారిపై చార్జీల రూపంలో పెనుభారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ కుట్రలను వెంటనే కట్టిపెట్టి రైల్వేల్లోని ఖాళీలను భర్తీ చేయాలని ప్రభాకర్ ఆండ్రూస్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఆర్ఈఎస్ ప్రధాన కార్యదర్శులు భరణి భానుప్రసాద్, రవూఫ్ తదితరులు పాల్గొన్నారు.