శ్రీశైలం : యుగయుగాలనాటి సనాతన హిందూ ధర్మమే ప్రపంచానికి మూలాధారమని తాళ్లాయపాలెం శైవక్షేత్ర పీఠాధిపతి శ్రీశివస్వామి అన్నారు. బుధవారం క్షేత్రపరిధిలోని వాసవివిహార్లో ధర్మో రక్షతి రక్షితః ట్రస్ట్ అనుబంధమైన సనాతన నృత్యకళా విభాగ్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి జానపద, కూచిపూడి, భరతనాట్య పోటీలు కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచమంతా నేడు భారత దేశ సంస్కృతి సాంప్రదాయాలను అలవర్చుకోవాలని ఆసక్తి చూపుతుండటం గర్వించదగ్గ విషయమన్నారు. అదే విధంగా తల్లిదండ్రులు చిన్నారులకు మన పురాణ ఇతిహాసాలు గ్రంథాలపై అవగాహన కల్పిస్తూ ఉన్నత విద్యాభ్యాసం కల్పించాలని కోరారు. సాంప్రదాయాలకు అద్దంపట్టే ఇటువంటి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహకరిస్తూ చిన్నారులకు, కళాకారులకు ప్రోత్సాహాన్నివ్వాలని కోరారు.
కార్యక్రమంలో వాసవి సత్ర సముదాయం అధ్యక్షులు దేవకి వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ.. హిందూ ధార్మిక కార్యక్రమాలు చేసుకునేందుకు తాము ఎల్లప్పుడూ అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. వివిధ రాష్ర్టాల నుండి ఇక్కడికి వచ్చి ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు చేసుకుంటారని తెలిపారు. అదే విధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుండి వచ్చిన కళాకారులకు ఐదు రోజులపాటు పొటీలు నిర్వహించనున్నట్లు ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్, గౌరవాధ్యక్షులు శ్రీవల్లి మరియు ప్రధాన కార్యదర్శి కరీముల్లా తెలిపారు.