మహబూబ్నగర్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అతడో సాధారణ రైతు.. తనకున్న ఎకరంలో పండిన పంటనే అతడికి జీవనాధారం.. ఆ ఎకరం సాగు చేసుకుందామంటే కూలీలు దొరకని పరిస్థితి.. పంటకు రసాయనాల పిచికారీ, ఎరువులు వేయడం ఖర్చుతో కూడుకునేది. సాగులో ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు తన ఆలోచనకు పదునుపెట్టాడు.
కూలీల అవసరం లేకుండా పొలంలో పెస్టిసైడ్తో పాటు ఎరువులను కేవలం ఒక వ్యక్తి సాయంతో పిచికారీ చేసే పరికరాన్ని రూపొందించాడు నారాయణపేట జిల్లా నర్వ మండలం కల్వాల గ్రామానికి చెందిన మఖ్తుం అలీ. రూ.50 వేల ఖర్చుతో ఒక ఎడ్లబండిలో 5 హెచ్పీ ఇంజిన్, స్ప్రే పంపు, బ్యాటరీ, డైనమో, రెండు వైపర్ మోటార్లు, రెండు డ్రమ్ములు, రెండు స్ప్రేయింగ్ గన్స్తో ఈ పరికరాన్ని రూపొందించాడు. స్ప్రే గన్స్ ఇంటింటా ఇన్నోవేషన్ ప్రోగ్రామ్కు ఎంపికైంది. జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి సాధించి రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ అయ్యింది. ఈ యంత్రాన్ని రైతులే ఇంటి వద్ద తయారు చేసుకొనే టెక్నాలజీని అభివృద్ధి చేసిన ఆ రైతును స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా అవార్డుతో సత్కరించారు.