మహబూబ్నగర్, డిసెంబర్ 1: బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు ఎగ్జిట్ పోల్స్ను నమ్మొద్దని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పదిలంగా ఉన్నారని, మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆరేనని మంత్రి స్పష్టం చేశారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి చంద్రశేఖర్తో కలిసి శ్రీనివాస్గౌడ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కుల, బీజేపీ మత రాజకీయాలు చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేశాయని విమర్శించారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచే వారిని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బెంగళూర్లో ఉంచేందుకు ప్లాన్ చేయడం వెనుక ఆంతర్యం ఎటువైపు దారితీస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుల నాటకాలు.. సురభి వాళ్లను మించి ఉన్నాయని ఎద్దేవా చేశారు.
వందకు వందశాతం బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 3వ తేదీన 8 గంటల్లోపే కాంగ్రెస్ పార్టీ వారు సంబురాలు చేసుకుంటారని, 9 గంటల తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు నిజమైన సంబురాలు చేసుకుంటాయని తెలిపారు. హంగ్కు చాన్స్లేదని, హ్యాట్రిక్ పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. 2018 ఎన్నికల్లోనూ ఇలాగే అన్నారని, చూస్తే మైండ్బ్లాక్ అయ్యేలా గులాబీ పార్టీకి 88 సీట్లు వచ్చాయని గుర్తు చేశారు. ప్రస్తుతం అందే సీన్ రిపీట్ అవుతుందని చెప్పారు. 71 నుంచి 81 సీట్లు రావడం పక్కా అన్నారు. హ్యాట్రిక్గా సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేశ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, నాయకులు పాల్గొన్నారు.