యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాలు హోరెత్తిస్తున్నాయి. పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులతో నిర్వహిస్తున్న ఈ సమ్మేళనాలు ఆద్యంతం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతున్నాయి. శనివారం మర్రిగూడ మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం, వనభోజన కార్యక్రమాలు అట్టహాసంగా సాగాయి. ఉదయం నుంచే టీఆర్ఎస్ కార్యకర్తలు కార్యక్రమానికి తరలివచ్చారు. మర్రిగూడ పట్టణంలోని చౌరస్తా నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు.
పోతరాజుల విన్యాసాలు, ఒగ్గు కళాకారుల డోలు చప్పుళ్లు, డీజే మోతలు, కోలాటాలు, బతుకమ్మలు, బోనాలతో పెద్ద ఎత్తున నిర్వహించిన ఊరేగింపులో టీఆర్ఎస్ కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మధ్యాహ్నం రుచికర భోజనాలను ఆరగించారు. వేదికపై ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకొన్నారు. తెలంగాణ ఉద్యమం నాటి ముచ్చట్లు యాది చేసుకొన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చర్చించుకొన్నారు. అనంతరం కళాకారుల ధూంధాంతో ప్రాంగణమంతా దద్దరిల్లిపోయింది. తెలంగాణ పాటలు, మాటలు విశేషంగా ఆకట్టుకొన్నాయి. అంతకుముందు పేరిణి నృత్యం అలరించింది.
బీజేపీకి గుణపాఠం చెప్పాలి: ఎంపీ బడుగుల
మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఎన్నిసార్లు గెలిచినా ప్రజలకు చేసిందేమీ లేదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ విమర్శించారు. స్వలాభం కోసం రాజకీయాలు చేస్తున్నారని, మునుగోడు ప్రజలు ఓటుతో ఆయనకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. శనివారం మర్రిగూడలో నిర్వహించిన టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. మూడేండ్లలో పైసా పని చేయలేనోడు.. కొత్తగా గెలిపిస్తే చేసేదేమీ ఉండదన్నారు. అబద్ధాలతో కాలం గడుపుతున్నాడని మండిపడ్డారు.
మునుగోడు ప్రజలు ఓటేసి గెలిపిస్తే బీజేపీకి రూ.22 వేల కోట్లకు అమ్ముడుపోయి, నియోజకవర్గ ప్రజలను దగా చేశాడని ధ్వజమెత్తారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇప్పటికీ పింఛన్ నెలకు రూ.600 మాత్రమే ఇస్తున్నట్టు చెప్పారు. దేశంలో ఇతర ఏ రాష్ట్రంలో లేని పథకాలు ఒక్క తెలంగాణలోనే ఉన్నాయని చెప్పారు. ఇతర రాష్ర్టాల నేతలు, ప్రజలు సైతం కేసీఆర్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్, బీజేపీ నుంచి భారీగా చేరికలు
మర్రిగూడ: మర్రిగూడ, చండూరు మండలాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున టీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
మండలంలోని ఖుదాభక్ష్పల్లికి చెందిన కాంగ్రెస్ వార్డు సభ్యురాలు మాదగోని ఎలమ్మజానయ్య, యూత్ సభ్యులు వీరమల్ల శిశుపాల్, మణిపాల్, మాదగోని నాగరాజు సహా 30 కుటుంబాలు జడ్పీటీసీ పాశం సురేందర్రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. కొట్టాల గ్రామంతోపాటు చండూరు మండలంలోని జోగిగూడెం, చండూరు పట్టణం నుంచి బీజేపీకి చెందిన 62 మంది సీనియర్ కార్యకర్తలు మాజీ సర్పంచ్ గంట కృష్ణసాగర్ ఆధ్వర్యంలో, తిరుగండ్లపల్లికి చెందిన కాంగ్రెస్, బీజేపీల నుంచి వంద మంది కార్యకర్తలు సర్పంచ్ ఐతపాక జంగయ్య ఆధ్వర్యంలో, నామాపురం నుంచి 15 మంది కాంగ్రెస్ కార్యకర్తలు మండలాధ్యక్షుడు తోటకూరి శంకర్ ఆధ్వర్యంలో, ఇందుర్తి మేటిచందాపురానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు నలుగురు ఎంపీటీసీ సరితానగేశ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు.