హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): కండ్లుండీ చూడలేని వారికి అభివృద్ధి కనిపించదంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. వరంగల్లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానపై నడ్డా వ్యాఖ్యలను ట్విట్టర్ వేదికగా ఖండించారు. చారిత్రక వరంగల్ నగరాన్ని హెల్త్ సిటీగా మార్చాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని గుర్తుచేశారు. 24 అంతస్తుల్లో 2,000 పడకలతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణానికి ప్రభుత్వం రూ.1,100 కోట్లను మంజూరు చేసిందన్నారు. వెంటనే టెండర్లు పిలిచి, ్ల ప్రక్రియ చేపట్టి, శరవేగంగా పనులు ప్రారంభించిందని చెప్పారు. మూణ్ణెల్లలోనే 15% పనులు పూర్తయ్యాయని వివరించారు. నోరు తెరిస్తే ఝూటా ప్రచారం చేసేవారికి ఈ దవాఖానతో కలిగే ప్రయోజనాలు అర్థం కావని చురకలంటించారు. వరంగల్లో నిర్మిస్తున్నది దవాఖాన మాత్రమే కాదు.. ప్రభుత్వ రంగంలో దేశంలోనే ఒకే ఒక అధునాతన హెల్త్ సిటీ అని పేర్కొన్నారు. ఇది పూర్తయితే ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందడంతోపాటు వైద్యవిద్య, పరిశోధనలకు కేంద్రంగా వరంగల్ నిలుస్తుందని వివరించారు.