Srisailam | శ్రీశైలం : శుక్రవారం మధ్యాహ్నం సమయానికి అమావాస్య ఘడియలు రావడంతో శ్రీశైల క్షేత్ర పాలకుడైన శ్రీబయలు వీరభద్రస్వామివారికి దేవస్థానం విశేషపూజలను నిర్వహిస్తున్నది. ఈ సాయంకాలం పూజాదికాలు నిర్వహించబడుతాయి.
ప్రతీ మంగళవారం, అమావాస్యరోజులలో ఈ విశేషార్చనను జరిపించడం జరుగుతోంది. కాగా అమావాస్య రోజున భక్తులు కూడా పరోక్షసేవగా ఈ అర్చనను జరిపించుకునే అవకాశం కల్పించబడింది. ఈ రోజు పరోక్షసేవ ద్వారా 25 మంది భక్తులు ఈ విశేషపూజలను జరిపించుకుంటున్నారు.
తెలుగు రాష్ట్రాల నుండేకాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, గుజరాత్, తదితర ప్రదేశాల నుండి కూడా భక్తులు ఈ పూజలను జరిపించుకుంటున్నారు. కాగా ఈ పూజాదికాల కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతి పూజను నిర్వహించబడుతుంది. ఈ పూజాదికాలలో పంచామృతాలతోనూ, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధజలాలతో వీరభద్రస్వామివారికి అభిషేకం జరిపించబడుతుంది.
ఈ స్వామి ఆరాధన వలన గ్రహదోషాలు నివారించబడుతాయని, అరిష్టాలన్నీ తొలగి పోతాయని, ఎంతటి క్లిష్ట సమస్యలైనా పరిష్కరించబడతాయని, ప్రమాదాలు నివారించబడతాయని, సర్వకార్యానుకూలత లబిస్తుందని, అభీష్టాలు సిద్ధిస్తాయని పండితులు పేర్కొంటున్నారు. కాగా ఈ పరోక్షసేవ ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించేందుకు వీలుగా ప్రసార వివరాలు, ప్రసారాల సమయం మొదలైనవాటిని ఎప్పటికప్పుడు సేవాకర్తలకు తెలియజేయడం జరుగుతుంది. సేవాకర్తలేకాకుండా భక్తులందరు కూడా వీటిని శ్రీశైలటి.వి / యూ ట్యూబ్ ద్వారా వీక్షించే అవకాశం కల్పించబడుతుంది. ఇతర వివరములకు దేవస్థానం సమాచార కేంద్ర ఫోన్ నంబర్లు 8333901351 / 52 / 53 / లను సంప్రదించవచ్చునని కార్యనిర్వహణాధికారి తెలిపారు.