కరోనా మహమ్మారి తర్వాత మీజిల్స్ (తట్టు) చాపకింద నీరులా విస్తరిస్తున్నది. ఇప్పటికే దేశంలోని బీహార్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్రలో తట్టు కేసులు నమోదయ్యాయి. ముంబైలో 13 కేసులతోపాటు ఒక మరణం కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో ఈ అంటువ్యాధి నుంచి పిల్లలను కాపాడుకొనేందుకు తెలంగాణ సర్కారు సర్వసిద్ధమైంది. ఫీవర్ విత్ ర్యాషస్ సర్వే నిర్వహిస్తూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. మీజిల్స్ బాధితుల కోసం హైదరాబాద్లోని నిలోఫర్లో ప్రత్యేక వార్డును కూడా ఏర్పాటు చేసింది.
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి తర్వాత మీజిల్స్ ముప్పు ప్రారంభమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆందోళన వ్యక్తంచేసింది. కరోనా ప్రారంభమైన తర్వాత మీజిల్స్ ఇమ్యునైజేషన్ గణనీయంగా పడిపోవడంతో ఈ అంటువ్యాధి వేగంగా వ్యాపించే ముప్పు ఉన్నదని డబ్ల్యూహెచ్వో పేర్కొంది. కొవిడ్-19 వల్ల 2021లో దాదాపు 4 కోట్ల మంది పిల్లలు మీజిల్స్ టీకాలు మిస్ అయ్యారని తెలిపింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు ఈ అంటువ్యాధి వ్యాపిస్తున్నదని తెలిపింది. దుర్భల ప్రాంతాల్లో 9 నెలలనుంచి ఐదేండ్ల వయస్సుగల పిల్లలందరికీ మీజిల్స్, రుబెల్లా అదనపు వ్యాక్సిన్ మోతాదులు అందించే విషయాన్ని పరిశీలించాలని రాష్ర్టాలను కేంద్ర సర్కారు సూచించింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు మీజిల్స్కు అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి చికిత్స అందుబాటులో ఉంచడమే కాకుండా బాధితులను ముందగానే గుర్తించేందుకు ప్రత్యేకంగా ‘ఫీవర్ విత్ ర్యాషెస్’ సర్వే నిర్వహిస్తున్నది. పిల్లల్లో ఎరికైనా జ్వరంతోపాటు ఒంటిపై దద్దుర్లు లేదా చిన్నపాటి కురుపులు కనిపిస్తే.. వెంటనే వారికి స్థానిక హెల్త్ సెంటర్ల ఆధ్వర్యం లో వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. మీజిల్స్ అని తేలితే అవసరమైన చికిత్స అందిస్తున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. మీజిల్స్ను తట్టుకునే శక్తి తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖకు ఉందని వైద్యులు ధీమా వ్యక్తంచేస్తున్నారు.
నిలోఫర్లో ప్రత్యేక వార్డు..
తట్టు గురించి ఆందోళన అవసరం లేదని, తెలంగాణలో దాదాపు పిల్లలందరికీ మీజిల్స్ టీకాలు వేయిస్తున్నట్టు నిలోఫర్ దవాఖాన ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్ డాక్టర్ టీ ఉషారాణి తెలిపారు. పాతబస్తీలోని కొంత మంది పిల్లలకు టీకాలు సరిగ్గా వేయించకపోవడంవల్ల అక్కడ నుంచి అప్పుడప్పుడు మీజిల్స్ కేసులు నిలోఫర్కు వస్తున్నాయని తెలిపారు. నిలోఫర్లో నెలకు సుమారు 10 నుంచి 15 కేసులు వస్తుంటాయని, 95 శాతం కేసులను ఓపీ ద్వారానే ట్రీట్ చేస్తున్నట్టు చెప్పారు. 5 శాతం క్రిటికల్ కేసులను అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తున్నామని పేర్కొన్నారు. తట్టు ఒకరి నుంచి మరొకరికి సోకకుండా ఉండేందుకు పిల్లల కోసం నిలోఫర్లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.