హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ) : ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేకంగా టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ డిసెంబర్లోపు వీరి కోసం రెండు స్పెషల్ టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. వీటి నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వ అనుమతి కోరింది. ఇందుకు అనుమతిస్తే రెండు స్పెషల్ టెట్ పరీక్షలు నిర్వహించనున్నది. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరని 2025లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
పైస్థాయి పదోన్నతులకు టెట్ ఉండాల్సిందేనని ధర్మాసనం స్పష్టంచేసింది. టెట్ లేకుండా నియమితులైనవారు రెండేండ్లలోపు టెట్ క్లియర్ చేయాలని సర్వోన్నత ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఈ గడువులోపు టెట్ అర్హత సాధించకపోతే ఉద్యోగాన్ని వదులుకోవాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. ఐదేండ్ల కంటే తక్కువ సర్వీస్లో ఉన్నవారు, ఉద్యోగంలో ఉండేందుకు టెట్ పాస్ కావాల్సిన అవసరంలేదు. కానీ వీరు పదోన్నతి పొందాలంటే మాత్రం టెట్ కచ్చితంగా పాస్ కావాల్సిందే. దీంతో రాష్ట్రంలో టెట్ లేకుండా టీచర్లుగా నియమితులైన వారు కూడా తాజాగా టెట్ పరీక్షలో పాస్ కావాల్సి ఉన్నది.
సుప్రీంకోర్టు విధించిన రెండేండ్ల గడువు 2027 ఆగస్టు 31తో ముగియనున్నది. అంటే ఇంకా 16 మాసాలు మాత్రమే గడువున్నది. రాష్ట్రంలో 1.02 లక్షల మంది టీచర్లుండగా, వీరిలో 57వేల మంది టీచర్లు టెట్ అర్హత లేనివారున్నారు. ఇటీవల నిర్వహించిన టెట్ పరీక్షల్లో 30వేల మంది వరకు టెట్ పాసయ్యారు. మరో 27వేల మంది ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ పాస్కావాల్సి ఉన్నదని అధికారులు చెప్తున్నారు. తాజాగా 2026 జూన్ టెట్ నోటిఫికేషన్ సైతం విడుదలైంది. ఈ టెట్ను మినహాయిస్తే ఈ ఏడాది డిసెంబర్లోపు ఇన్ సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తున్నది.
టెట్పై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రాష్ట్రంలోని టీచర్లలో ఆందోళన నెలకొన్నది. ఇదే విషయంపై ఉపాధ్యాయ సంఘాలు గళమెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఇన్సర్వీస్ టీచర్లకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశాయి. సీఎం, మంత్రులు, అధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించాయి. పార్లమెంట్లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశాయి. మేఘాలయ ప్రభుత్వం అర్హత మార్కులను 90 నుంచి 68కి తగ్గించింది. ఈ తరహాలో మార్కులు తగ్గించాలని కోరాయి. అర్హత మార్కుల తగ్గింపు, టెట్ నుంచి మినహాయింపుపై సర్కార్ ఏదీ తేల్చలేదు. మరోవైపు టెట్ నోటిఫికేషన్లు జారీచేస్తున్నది. తాజాగా స్పెషల్ టెట్లను నిర్వహించేందుకు మొగ్గుచూపింది. టెట్ పరీక్షలను ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. దీంతో ఇటీవలే సర్కార్ పాఠశాల విద్యాశాఖ అభిప్రాయం కోరింది. ఈ పరీక్షలను ఆఫ్లైన్లో నిర్వహించడం సాధ్యం కాదని, ఆన్లైన్లోనే నిర్వహిస్తామని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.