హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని సింగరేణి కాలనీలో ఆరేండ్ల చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడు పల్లకొండ రాజు కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని ప్రతి సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ప్రతి గల్లీని శోధిస్తున్నారు. హోంమంత్రి మహమూద్అలీ తన కార్యాలయంలో డీజీపీ ఎం మహేందర్రెడ్డి, పోలీసు ఉన్నతాధికారుల తో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగేలా ఆదేశాలు జారీచేసినట్టు తెలిసింది. సీఎం కేసీఆర్ చాలా సీరియస్గా ఉన్నారని హోంమంత్రి తెలిపారు. బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారని చెప్పారు. బాధిత కుంటుంబానికి అన్ని రకాలుగా సహకారం అందించాలని, యుద్ధప్రాతిపదికన దర్యాప్తు చేయాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు.
మద్యం మత్తే పట్టించాలి
పూటుగా మద్యం తాగే అలవాటున్న రాజు.. ఎట్టిపరిస్థితుల్లోనూ మద్యం, లేదా కల్లు దుకాణాలను వెతుక్కుంటూ బయటికొచ్చే అవకాశం ఉన్నట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు వాటివద్ద పోలీసులు మఫ్టీలో మాటువేశారు. నిందితుడు రాజు ఫొటోలు, ఊహా చిత్రాలను సైతం హైదరాబాద్ సిటీ పోలీసులు విడుదల చేశారు. నిందితుడు మారువేషంలో తిరిగినా గుర్తించేలా, జుట్టు, గడ్డాన్ని మార్పు చేస్తూ మొత్తం నాలుగు రకాల ఫొటోలను రిలీజ్ చేశారు. రాజు ఎవరితోనూ ఎక్కువగా ఫోన్లో మాట్లాడలేదని, కేసు దర్యాప్తు త్వరగా కొలిక్కి రాకపోవడానికి ఇదీ ఓ కారణం అవుతున్నదని ఓ అధికారి తెలిపారు. ఘటన తర్వాత నిందితుడితో కలిసి వెళ్తున్న వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఘటన తర్వాత ఒక ఇంట్లో పనిచేసి అక్కడ వచ్చిన రూ.వెయ్యిని ఇద్దరు చెరో రూ.500గా పంచుకుని, వాటితో మద్యం తాగి ఎవరిదారిన వాళ్లు వెళ్లినట్టు ఆ వ్యక్తి చెప్పినట్టు తెలిసింది. అడ్డగూడూరులో ఉండే రాజు తల్లిదండ్రులు, అతని సన్నిహితులను సైతం ఇప్పటికే పోలీసులు ప్రశ్నిస్తున్నారు.