హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీని మరింత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు పశుసంవర్ధక శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే రెండో విడత గొర్రెల పంపిణీ కోసం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ను ఉపయోగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్తో అధికారులు చర్చలు జరుపుతున్నారు. వీలైనంత త్వరగా సాఫ్ట్వేర్ను రూపొందించి గొర్రెల పంపిణీని ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. గొర్రెల పంపిణీలో అవకతవకలకు చెక్ పెట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అవి పూర్తిస్థాయిలో సత్ఫలితాలను ఇవ్వడం లేదని అధికారులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో ఎలాంటి అవకతవకలకూ తావు లేకుండా, గొర్రెల పంపిణీని పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ అవసరమని అధికారులు భావిస్తున్నారు. ఈ సాఫ్ట్వేర్ అందుబాటులోకి వస్తే.. ఏ జిల్లాలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు? ఎందరు డీడీలు చెల్లించారు? ఆ గ్రామానికి ఎన్ని యూనిట్ల గొర్రెలు అవసరం? ఆ జిల్లాకు ఎన్ని నిధులు విడుదలయ్యాయి? ఎన్ని ఖర్చయ్యాయి? ఎన్ని యూనిట్ల గొర్రెలు పంపిణీ అయ్యాయి? వంటి వివరాలు పక్కాగా ఉండనున్నాయి. ఇతర రాష్ర్టాల్లో గొర్రెల కొనుగోలు మొదలుకొని.. క్షేత్రస్థాయిలో లబ్ధిదారుడికి అందించే వరకు ప్రతి అడుగును ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడానికి సాఫ్ట్వేర్ ఉపకరించనున్నది.
గొర్రెలు కొనుగోలు చేసినప్పుడు, లబ్ధిదారునికి పంపిణీ చేసేప్పుడు ప్రతి దశలోనూ ఫోటోలు తీసి సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో త్వరలోనే రెండో విడుత గొర్రెల పంపిణీకి అధికారులు చర్యలు ప్రారంభించారు. 3.50 లక్షల యూనిట్ల పంపిణీగాను నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్సీడీసీ) రూ.4,563.75 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. వీలైనంత త్వరగా సాఫ్ట్వేర్ను రూపొందించి రెండోవిడత గొర్రెల పంపిణీని చేపడుతామని పశుసంవర్ధక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ రాంచందర్ తెలిపారు.