ఆదిలాబాద్, జూన్ 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి): పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ‘నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహన సదస్సులు గెలుపు వారధులుగా నిలుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సదస్సులకు ఉద్యోగార్థుల నుంచి విశేష స్పందన వస్తున్నది. ఆదిలాబాద్లో జోగు ఫౌండేషన్ సహకారంతో సోమవారం నిర్వహించిన సదస్సుకు ఉదయం 9 గం టల నుంచే ఉద్యోగార్థులు బారులుదీరారు. సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత మల్లవరపు, వేప అకాడమీ డైరెక్టర్ డాక్టర్ వేప అభ్యర్థులకు దిశా నిర్ధేశం చేశారు. పోటీ పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలి? ఏ సబ్జెక్టులు చదవాలి? విజయతీరాలకు చేరాలంటే తీసుకోవాల్సిన మెలకువలు, ఇతర అంశాలపై అవగాహన కల్పించారు. ఉదయం 10:45 గంటలకు ప్రారంభమైన సదస్సు మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది. ఉద్యోగార్థులు అడిగిన సందేహాలను నిపుణులు నివృత్తి చేశారు.
నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో వెలువడుతున్న నిపుణ ఉద్యోగార్థులకు ప్రయోజనకరంగా ఉన్నదని నిపుణులు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. నిరుద్యోగ యువత నిపుణుల సలహాలు, సూచనలు పాటిస్తూ ఉద్యోగాలకు ప్రిపేర్ కావాలని సూచించారు. జోగు ఫౌండేషన్, ‘నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే’ ఉద్యోగార్థుల కోసం అవగాహన సదస్సు నిర్వహించటం అభినందనీయమని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్చైర్మన్ జహీర్ రంజానీ, నమస్తే తెలంగాణ స్టేట్ బ్యూరో చీఫ్ ఏ శ్రీనివాస్, ఆదిలాబాద్ బ్యూరో ఇన్చార్జి బీ రఘునాథ్రావు తదితరులు హాజరయ్యారు.