కొల్లాపూర్ రూరల్, సెప్టెంబర్ 28 : పాలమూరు ప్రాజెక్టు వద్ద జలసంబురం నెలకొన్నది. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద పీఆర్ఎల్ఐ లిఫ్ట్-1 మొదటి మోటరు నుంచి నీటి విడుదల కొనసాగుతున్నది. రోజుకు 2 టీఎంసీల చొప్పున నీటిని ఎత్తిపోసేలా 8 పంపులను ఏర్పాటు చేశారు. ఒక మోటర్ను ప్రారంభించగా నీరంతా సమీపంలోని అంజనగిరి రిజర్వాయర్లోకి చేరుతున్నది. గురువారం సాయంత్రానికి 0.15 టీఎంసీల నీళ్లు చేరాయి. ఇక్కడ కొండలను ఆనుకొని పక్కపక్కనే నిర్మించిన అంజనగిరి, ఎల్లూరు రిజర్వాయర్లు రైతులకు వరప్రదాయినిగా మారాయి. నీటి విడుదలతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.