యాదాద్రి, జూలై 30 : యాదగిరిగుట్టలో శ్రావణ మాసం సందడి నెలకొన్నది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొన్నారు. స్వామి, అమ్మవార్ల నిత్యపూజలు అత్యంత వైభవంగా సాగాయి. సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి కల్యాణ తంతును జరిపారు.
తిరువారాధన, బాలబోగం, స్వామివారికి నిజాభిషేకాన్ని నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు తులసీ సహస్రనామార్చనలు, సాయంత్రం తిరువారాధన, వెండి మొక్కు జోడు సేవ, దర్బార్ సేవలను జరిపారు. ‘శ్రావణలక్ష్మీ కోటి కుంకుమార్చన’ను రెండో రోజూ వైభవంగా నిర్వహించారు. ప్రధానాలయ ప్రాకారంలో 30 మంది రుత్వికులు 3.60 లక్షల లక్ష్మీ సహస్రనామాలు పఠించారు. శనివారం స్వామివారిని 17 వేల మంది భక్తులు దర్శించుకోగా.. ఖజానాకు రూ.23,55,449 ఆదాయం వచ్చినట్టు ఈవో గీత తెలిపారు.