2009 డిసెంబర్ 9…తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన రోజు. అస్తిత్వానికి, ఉద్యమానికి గుర్తింపు లభించిన రోజు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అని పిడికిలి బిగించి 11 రోజుల ఆమరణ దీక్ష చేపట్టిన కేసీఆర్ ఉద్యమ సంకల్పం ముందు ఢిల్లీ గద్దె తలదించక తప్పనిరోజు. తెలంగాణతల్లి ఎదుట ఢిల్లీ మోకరిల్లిన రోజు. ఆ చరిత్రాత్మక సందర్భానికి నేటితో 13 ఏండ్లు. అయినా, డిసెంబర్ 9 ప్రకటన తెలంగాణ ప్రజల గుండెల్లో తడి ఆరకుండా అలాగే ఉండిపోయింది. అంతకుముందు జరిగిన పరిణామాలు, కేసీఆర్ 11 రోజుల ఆమరణ దీక్ష.. అస్థిత్వవాద ఉద్యమాలకు ఓ ప్రత్యేక పాఠం.
హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): డిసెంబర్ 9.. ఉద్యమరూపం భావజాల వ్యాప్తి దశ నుంచి పోరాట పథానికి మారిన సందర్భం. ఉద్యమనేత, టీఆర్ఎస్ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నవంబర్ 29, 2009న ఆమరణ దీక్ష ప్రారంభించింది మొదలు 11 రోజులపాటు నలుదిక్కులను ఏకం చేసి కేంద్రం తెలంగాణ ఏర్పాటు చేయక తప్పని అనివార్యతను సృష్టించిన అజరామర ఘట్టం. ఆమరణ దీక్షకు సిద్ధమైన కేసీఆర్ హైదరాబాద్ నుంచి బయల్దేరి నవంబర్ 26న కరీంనగర్ తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణభవన్కు చేరుకొన్నారు. అప్పటికే ‘తెలంగాణ వచ్చుడో..కేసీఆర్ సచ్చుడో’.. ‘తెలంగాణ జైత్రయాత్రో..కేసీఆర్ శవయాత్రో’ అని నినదించి ఉండటంతో తెలంగాణ వ్యాప్తంగా ఉద్విగ్న, ఉత్కంఠభరిత వాతావరణం నెలకొన్నది.
2009 నవంబర్ 29 నుంచి సిద్దిపేటలో ఆమరణ దీక్ష చేపడుతానని కేసీఆర్ ప్రకటించగానే ముందురోజు అర్ధరాత్రి కరీంనగర్లో ఉద్విగ్న వాతావరణం నెలకొన్నది. కేసీఆర్ బస చేసిన ఉత్తర తెలంగాణ భవన్ చుట్టూ మోహరించిన పోలీసులు.. కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకొన్నారు. అంతే దీటుగా ప్రజలు, కార్యకర్తలు పోలీసు ప్రయత్నాలను తిప్పికొట్టడానికి ఉద్యుక్తులయ్యారు. అంతటి పోలీసు బలగాల మధ్యలోనూ ఉత్తర తెలంగాణ భవన్లో రాత్రంతా ధూంధాం కార్యక్రమం ఉద్యమ రణన్నినాదమై ఎగిసిపడుతున్నది. క్షణం ఒక యుగంలా తెలంగాణ తెల్లవారింది. నవంబర్ 29న ఉదయం కరీంనగర్లో కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వ దమనకాండను ఎండగట్టారు. అక్కడి నుంచి తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్, మాజీమంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కెప్టెన్ లక్ష్మీకాంతారావు తదితరులతో కలిసి వాహనంలో సిద్దిపేట దీక్షాస్థలికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఉత్తర తెలంగాణ భవన్ వద్ద వేలాదిమంది కార్యకర్తలు, నాయకులు మోహరించటంతో పోలీసులు తమ వ్యూహాన్ని కరీంనగర్ పొలిమేరలకు మార్చుకొన్నారని తర్వాత అల్గనూర్ వద్ద జరిగిన పరిణామాలతో తేటతెల్లమైంది. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య అల్గనూర్ చౌరస్తా వద్ద కేసీఆర్ వాహనాన్ని అడ్డుకొని ఆయన్ను అదుపులోకి తీసుకొన్నారు. ఉద్యమాన్ని ఒంటిచేత్తో నడిపిస్తున్న కేసీఆర్ను అదుపులోకి తీసుకున్నది సాధారణ పోలీసులు కాదు. ఉగ్రవాదులు, సంఘవిద్రోహ శక్తులతో తలపడేందుకు వినియోగించే ప్రత్యేక పోలీసు బలగం ‘ఆక్టోపస్’.
2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అధికారిక ప్రకటన చేసిన కేంద్రం, దానినుంచి వెనక్కి మళ్లేందుకు శతవిధాలా ప్రయత్నించింది. తెలంగాణ ప్రజల ఉద్యమ చైతన్యం, రథసారథిగా కేసీఆర్ వ్యూహం.. కేంద్రాన్ని గుక్కతిప్పుకోనివ్వలేదు. ఫలితంగా..రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని అధికారికంగా ప్రకటించిన ఐదేండ్లకు అంటే 2014న జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది.
ఖమ్మం కోర్టు కేసీఆర్కు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే తన ఆమరణ దీక్షను విరమించే ప్రసక్తేలేదని ప్రకటించిన కేసీఆర్ జైల్లోనే దీక్ష కొనసాగించారు. ఆ తర్వాత నాటకీయ పరిణామాల నడుమ ఖమ్మం దవాఖానకు, అక్కడి నుంచి హైదరాబాద్ నిమ్స్కు తరలించేదాకా యావత్ తెలంగాణకు క్షణమొక యుగంలా గడిచింది. కేసీఆర్ ఆరోగ్యం క్షీణిస్తున్నదన్న సమాచారంతో తెలంగాణలో అగ్గి రాజుకొన్నది. రణమై తెలంగాణ అంతటా ప్రజ్వరిల్లింది. బందులతో బస్సులు, రైళ్ల రాకపోకలు స్తంభించాయి. పరిస్థితి చేయి దాటుతుండటంతో అప్పటి సీఎం రోశయ్య అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సీపీఎం మినహా అన్ని పార్టీలు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించాయి. ఇదేవిషయం స్పష్టం చేస్తూ ఢిల్లీకి నివేదిక కూడా ఇచ్చాయి. పరిణామాలు వేటికవే పోటాపోటీగా కొనసాగాయి. చివరకు కేసీఆర్ దీక్ష ప్రారంభించిన 11 రోజులకు.. సరిగ్గా డిసెంబర్ 9న కేంద్రం దిగివచ్చి ప్రత్యేక రాష్ట్ర ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు అర్ధరాత్రి.. అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం అధికారిక ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో యావత్ తెలంగాణ పులకించిపోయింది. ఆందోళన స్థానంలో హర్షాతిరేకాలు చేరాయి. ధర్నాలు, నిరసనలు.. సంబురాలు, విజయోత్సవాలుగా మారాయి.