మంచిర్యాల అర్బన్, ఫిబ్రవరి 27 : లంచం తీసుకుంటూ మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ ఏసీబీకి చిక్కారు. మంచిర్యాల సమీపంలోని గద్దెరాగడిలో నివాసముంటున్న విశ్వేశ్వర్ అనే పత్తి వ్యాపారి హనుమాన్ కాటన్ ఆగ్రో ఏజెన్సీ పేరిట లైసెన్స్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాడు. మార్కెట్ కమిటీ స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ కే శారద ఈ నెల 14న విశ్వేశ్వర్ను కార్యాలయానికి పిలిచి లైసెన్స్ మంజూరైందని, లక్ష రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసింది. చివరకు రూ. 80 వేలకు ఒప్పందం చేసుకొని అదే రోజు రూ.15 వేలు తీసుకున్నది. మిగితా డబ్బుల కోసం పదేపదే ఫోన్లు చేస్తుండటంతో విశ్వేశ్వర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
సోమవారం విశ్వేశ్వర్ నుంచి శారద రూ. 65 వేలు లంచం డబ్బులు తీసుకుంటుండగా కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ భద్రయ్య నేతృత్వంలో అధికారులు దాడి చేసి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. శారదను అదుపులోకి తీసుకొని కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టుకు తీసుకెళ్లినట్టు ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపారు.