హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): రైతులను నిలువునాముంచే నకిలీ విత్తన విక్రేతలపై ప్రభుత్వం క్రిమినల్ కేసులతో విరుచుకుపడుతున్నది. వ్యవసాయ, పోలీస్శాఖ కలిసి రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టి కేసులు నమోదుచేస్తున్నాయి. ఇటీవల సీఎం కేసీఆర్ ఆదేశాలతో తనిఖీలుచేసి ఇప్పటివరకు 28 మంది నకిలీ విత్తన విక్రేతలను అరెస్టుచేసి 10 క్రిమినల్ కేసులను నమోదుచేశారు. 2.5 కోట్ల విలువైన 192 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకొన్నారు. 2021 జనవరి నుంచి ఇప్పటివరకు 134 మందిపై 87 కేసులు నమోదుచేశారు. 2014 నుంచి ఇప్పటివరకు నకిలీ విత్తన విక్రేతలపై 602 కేసులు నమోదుచేసినట్టు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. నకిలీ విత్తనాల సరఫరాలలో వ్యవసాయశాఖ అధికారుల ప్రమేయం ఉంటే, వారిని కూడా సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో వ్యవశాయశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
ప్రభుత్వం ఈ సీజన్లో పత్తి పంటను ప్రొత్సహిస్తున్నది. సుమారు 70 లక్షల ఎకరాల్లో సాగుకు ప్రణాళికలు రూపొందించింది. ఈ నేపథ్యంలో నకిలీ పత్తి విత్తనాల ఏరివేతపై దృష్టిపెట్టింది. అనుమతి లేని హెచ్టీ (హెర్బిసైడ్ టోలరెంట్) రకం పత్తి విత్తనాలు మార్కెట్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నది. మహారాష్ట్ర సరిహద్దుల్లో అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. పత్తి విత్తనాలు నిల్వ ఉంచే గోదాముల్లో తనిఖీలు చేస్తున్నారు. ఇటీవల జరిపిన దాడుల్లో అనుమానంగా ఉన్న 54 శాంపిల్స్ను సేకరించారు. వీటిని ల్యాబ్లో పరీక్షించగా నాలుగు శాంపిల్స్ నకిలీవిగా తేలాయి.
నకిలీ విత్తన దందాను అరికట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోవద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఇటీవలే నకిలీ విత్తనాల దందాను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దంటూ వ్యవసాయ శాఖ, పోలీస్శాఖ అధికారులను ఆదేశించారు. నకిలీ విత్తనాలు సరఫరా చేసేవారిపై పీడీయాక్ట్లు నమోదుచేయాలని ఆదేశించారు. గత ఏడాది 8.5 కోట్ల విలువైన 1,885 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను స్వాధీనంచేసుకొన్నారు. హెచ్టీ పత్తి విత్తనాలకు సంబంధించి గతేడాది 624 శాంపిల్స్ సేకరించగా 138 శాంపిల్స్ నకిలీవిగా తేలాయి. రాష్ట్రంలో 2016 నుంచి 27 పీడీయాక్ట్ కేసులు నమోదుచేశారు. 2016లో ఏడుగురిపై, 2017లో ముగ్గురిపై, 2018లో ఒకరిపై, 2019లో ఇద్దరిపై, 2020లో 14 మందిపైన పీడీయాక్ట్ నమోదయ్యాయి.