హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): రెం డో విడత గొర్రెల పంపిణీకి అర్హులైన లబ్ధిదారులు తమ వాటాధనంగా డీడీలు చెల్లించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అధికారులను ఆదేశించారు. 10 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. మంగళవారం మాసబ్ట్యాంక్లోని మత్స్యశాఖ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల పశువైద్యాధికారులు, వెటర్నరీ అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇటీవల వర్షాల వల్ల మరణించిన జీవాల సమాచారాన్ని సేకరించి కలెక్టర్లు, పశుసంవర్ధకశాఖ ఉన్నతాధికారులకు నివేదికను అందజేసి బాధితులకు నష్టపరిహారం త్వరగా అందేలా చూడాలని ఆదేశించారు.
పెండింగ్ ఇన్సురెన్స్ క్లెయిమ్ను వారంలో పరిషరించాలని సూచించారు. కొత్త మండలాల్లో కూడా పశువైద్యశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, ఇందుకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. జిల్లాలవారీగా ఖాళీగా ఉన్న దవాఖాన సిబ్బంది, వీఏఎస్, వీఏల సమాచారాన్ని కూడా పంపించాలని సూచించారు. పశువుల కృత్రిమ గర్భధారణలో కూడా రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని ప్రశంసించారు. రాష్ట్రంలో తొలిసారిగా టెస్ట్ ట్యూబ్ బేబీ తరహాలో (ఐవీఎఫ్) రెండు మగ, ఒక ఆడ దూడలను ఉత్పత్తి చేయడం గొప్ప విజయంగా మంత్రి అభివర్ణించారు. సమావేశంలో షీప్ ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్యాదవ్, పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధర్సిన్హా, డైరెక్టర్ రాంచందర్, టీఎస్ఎల్డీఏ సీఈవో మంజువాణి పాల్గొన్నారు.
గొర్రెల పంపిణీ పథకం భేష్
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ పథకం ఎంతో బాగుందని కర్ణాటక పశు సంవర్ధకశాఖ అధికారులు ప్రశంసించారు. కర్ణాటక సీఎం బొమ్మై ఆదేశాల మేరకు గొర్రెల పంపిణీ పథకం అమలు, విధానాలను పరిశీలించేందుకు మంగళవారం అధికారుల బృందం రాష్ర్టానికి వచ్చింది. ఈ సందర్భంగా షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాల్రాజ్ యాదవ్తో భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని గొల్ల కురుమల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రూ.12 వేల కోట్లతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే రూ.5 వేల కోట్లతో 4 లక్షల మందికి 85 లక్షలకుపైగా గొర్రెలను పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు. ఈ పథకంతో కలిగే లాభాలను తమ ప్రభుత్వానికి వివరించి.. తమ వద్ద ఇలాంటి పథకం అమలుచేసేలా చూస్తామని అధికారులు తెలిపారు.