హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ) : చదువులో వెనుకబడ్డ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టిసారించింది. కనీస సామర్థ్యాల పెంపే లక్ష్యంగా ప్రత్యేక తరగతుల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం అమలుపై బుధవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని మం డల పరిషత్తు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. చదువులో వెనుకబడ్డ సర్కార్ బడుల్లోని 1-5 తరగతుల విద్యార్థులకు ఈ వేసవి సెలవుల్లోనే ప్రత్యేక తరగతులను నిర్వహిస్తామని మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి తెలిపారు. స్థానిక యువత, పూర్వ విద్యార్థులు, ఎన్జీవోల ప్రతినిధుల సేవలను వినియోగించుకొంటామని వెల్లడించారు. దీనిని ప్రయోగాత్మకంగా తన నియోజకవర్గం మహేశ్వరం నుంచి శ్రీకారం చుట్టినట్టు మంత్రి వెల్లడించారు. సమీక్షలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్, జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నాలుగు జిల్లాల్లో..
రాష్ట్రంలోని రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో ప్రత్యేక తరగతుల కార్యక్రమాన్ని అమలుచేయాలని నిర్ణయించారు. కరోనా పరిస్థితులు విద్యార్థుల చదువులను దారుణంగా దెబ్బతీశాయి. మరీ ముఖ్యంగా ప్రాథమిక స్థాయిల్లోని విద్యార్థుల్లో విద్యాప్రమాణాలు పడిపోయాయి. కనీసం చదవడం, రాయ డం, గణిత ప్రక్రియను చేయలేని పరిస్థితుల్లో పై తరగతులకు ప్రమోటయ్యారు. విద్యార్థులను గాడిలో పెట్టేందుకు కూడా ఈ ప్రత్యేక తరగతులు దోహదం చేస్తాయని అధికారులు భావిస్తున్నారు.
పూర్వ విద్యార్థులు భాగస్వామ్యం కావాలి
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విద్యావ్యవస్థలో అనేక మార్పులు తీసుకొస్తున్నాం. కరోనా పరిస్థితుల్లో విద్యార్థులు నష్టపోయారు. 1 నుంచి 5 తరగతుల్లో విద్యాప్రమాణాల పెంపు కోసం తొలిమెట్టు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాం. ఈ ప్రత్యేక తరగతుల నిర్వహణలో ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎన్జీవోలు, పూర్వ విద్యార్థులు, యువత స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలి.
– విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి